సచివాలయానికి వెళ్లేది బీజేపీ ముఖ్యమంత్రే: కేసీఆర్పై అమిత్ షా విమర్శలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో అమిత్ షా ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. తన కొడుకు కేటీఆర్ను ముఖ్యమంత్రిని ఎలా చేయాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని అన్నారు.
ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ ఒక్కసారైనా సచివాలయానికి వెళ్లారా? అని అమిత్ షా ప్రశ్నించారు. కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడం కోసమే కేసీఆర్ రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారని అమిత్ షా ఎద్దేవా చేశారు. అయితే, వచ్చే ఎన్నికల తర్వాత సచివాలయానికి వెళ్లేది బీజేపీ ముఖ్యమంత్రేనని జోస్యం చెప్పారు.
దేశం పురోగమిస్తుంటే తెలంగాణ తిరోగమిస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఒక్కసారి అవకాశమివ్వాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము మద్దతిచ్చామన్నారు. హైదరాబాద్ రాష్ట్ర విమోచన దినాన్ని కేసీఆర్ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కారు స్టీరింగ్ అసదుద్దీన్ ఒవైసీ చేతుల్లో ఉందన్నారు. పటేల్ లేకుంటే హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో భాగమయ్యేది కాదన్నారు. తెలంగాణలో కూడా వారసత్వ రాజకీయాలకు ముగింపు పలుకుతామన్నారు అమిత్ షా.
ఈటలకు అరుదైన గౌరవం
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ నుంచి ఈటలకు ఒక్కరికే మాట్లాడే అవకాశం వరించింది. తెలంగాణలో రాజకీయాలు, పార్టీ బలోపేతంపై ఈటల మాట్లాడారు. తర్వాత బాగా మాట్లాడారంటూ ఈటలను బీజేపీ ప్రతినిధుల ప్రశంసించినట్లు తెలుస్తోంది. సమావేశాల్లో మాట్లాడిన అనంతరం మీడియాతో ఈటల మాట్లాడుతూ.. తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించి అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తోందన్నారు.
30-40 ఏళ్లపాటు బీజేపీ శకమే
రానున్న 30 నుంచి 40 ఏళ్ల పాటు దేశంలో బీజేపీ శకం కొనసాగుతుందని, దీంతో భారత్ విశ్వగురుగా అవతరిస్తుందని హోంమంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యవర్గ సమావేశాల్లో రాజకీయ తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన.. వంశపారంపర్య, కుల, బుజ్జగింపు రాజకీయాలు దేశానికి శాపంగా మారాయని మండిపడ్డారు. దేశాన్ని దశాబ్దాలుగా పట్టిపీడిస్తోన్న సమస్యలకు అవే మూలమని అమిత్ షా ఆరోపించారు. పశ్చిమబెంగాల్, కేరళ, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడతాయన్నారు.