' ది యాక్సిడెంటల్ పీఎం' లో తెలంగాణ ! కేసీఆర్ అబద్దాలు చెప్పిండా ..?
హైదరాబాద్ : ఎన్నో వివాదాలకు మూలం అవుతున్న 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్' సినిమాలో తెలంగాణ ప్రస్థావన ఇప్పుడు వాడి వేడి చర్చకు తావిస్తోంది. సినిమాలో ప్రధాని మన్ మోహన్ సింగ్ పాత్రను వివాదాస్పదంగా చిత్రీకరించారని పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది. ఇదే అంశం కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చకు కూడా దారితీస్తోంది. ప్రధాన మంత్రి పదవి నామమాత్రంగా ఉండి, తెరవెనక ఏదో శక్తి ఆయనను నడిపించినట్టు చిత్రీకరించారని, అది పూర్తి స్థాయిలో ఆక్షేపించదగ్గ అంశమని కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. అంతే కాకుండా ప్రధాని పాత్రలో నటించిన అనుపమ్ ఖేర్ పై కేసులు కూడా నమోదైన సందర్బాలు ఉన్నాయి. ఇక తాజాగా సినిమాలో తెలంగాణ పట్ల చిత్రీకరించిన ఓ సన్నివేశం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
వివాదాలు రగుల్చుతున్న మజీ ప్రధాని బయోపిక్..! కేసీఆర్ ప్రస్థావన పై ఉత్కంఠ..!!
మాజీ ప్రధాన మంత్రి, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్, ప్రధాని కావాడానికి దారి తీసిన పరిస్థితులపై ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్' సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రను బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పై వివాదాలు అలుముకున్నాయి. 2004 నుంచి 2014 మధ్యలో మన్మోహన్ సింగ్ను కీలుబొమ్మగా చేసి సోనియా, రాహుల్ గాంధీలు ఎలా ఈ దేశాన్ని పరిపాలించారనేది ఈ చిత్రంలో చూపించారు.దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ సినిమా దర్శక, నిర్మాతలపై భగ్గుమంటోంది. ఈ చిత్ర నిర్మాణానికి దర్శక, నిర్మాతలు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి గాని అనుమతి తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది.
ఎలాంటి అనుమతులు తీసుకోకుండా చిత్రీకరణ..! అభ్యంతరం చెప్తున్న కాంగ్రెస్..!!
సినిమాను నిలుపుదల చేయాలని పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే కోర్డులో కేసులు కూడా వేశారు. ఐనా ఈ చిత్ర ప్రదర్శనను కోర్డు ఎలాంటి అవాంతరాలు తెలుపలేదు. ఈ చిత్రాన్ని ప్రముఖ పాత్రికేయుడు అప్పటి ప్రధాని మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్' అనే పుస్తకం ఆధారంగా విజయ్ రత్నాకర్ డైరెక్ట్ చేసాడు. రీసెంట్గా విడుదలైన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్' సినిమా కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా, దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ ప్రస్థావన..! కేసీఆర్ పై ఆసక్తికర సంభాషణలు..!!
సినిమాలో ఓ సన్నివేశంలో తెలంగాణ ప్రస్థావనను చిత్రీకరించారు. ప్రధాన మంత్రి సలహాదారు సంజయ్ బారు, సోనియాగాంధీ రాజకీయాల సలహాదారు ఆహ్మద్ పలేట్ మద్య ఓ ఆసక్తికర సంభాషణను చిత్రీకరించిన తీరు అందరిని ఆలోచింపజేస్తుంటే, తెలంగాణ సమాజానికి మాత్రం ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. తమ ప్రియతమ నేత, తెలంగాణ కల సాకారం చేసిన ఉద్యమ వీరుడు చంద్రశేఖర్ రావు సినిమాలో కనిపించకపోయినప్పటికి, ఆయన పై చోటు చేసుకున్న సంభాషణల సారాంశం తెలంగాణ ప్రజల మనో భావాలను గాయపరుస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సెగలు ఢిల్లీ ని కమ్ముకున్న రోజుల్లో కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వంతో చంద్రశేఖర్ రావు జరిపిన సంప్రదింపులు ఎంతో కీలంగా ఉండేవి.
మీడియాకు అవాస్తవాలు చెప్పిన కేసీఆర్..! సినిమాలో వివాదాస్పద సన్నివేశం..!!
ఆ సందర్బంలో తెలంగాణ పట్ల ఢిల్లీ పెద్దలతో గాని, కేంద్ర ప్రభుత్వంతో గాని జరిపిన సంప్రదింపుల గురించి సర్వత్రా చర్చజరుగుతుండేది. కాని సినిమాలో మాత్రం అందుకు భిన్నంగా సన్నివేశాలను చిత్రీకరించారు. తెలంగాణ అంశం పట్ల చంద్రశేఖర్ రావుతో సంప్రదింపులు జరగనప్పటికి మీడియా ముందు మాత్రం కాంగ్రెస్ పార్టీతో చర్చించినట్టు చంద్రశేఖర్ రావు స్వతహాగా ప్రకటించుకునే వాడని ఆహ్మద్ పటేల్, సంజయ్ బారుల మద్య సంభాషణలు చోటుచేసుకున్నాయి. దీంతో చంద్రశేఖర్ రావు అబద్దాలను, అవాస్తవాలను ప్రచారం చేసి స్వభావం గల వాడని సినిమాలో చెప్పే ప్రయత్నం జరిగినట్టు తెలుస్తోంది. ఇదే సన్నివేశం పట్ల తెలంగాణ సమాజం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.