నేను గిన్నెలు శుభ్రం చేస్తా: కేటీఆర్కు మద్దతుగా ఫోటోలు పెడుతూ నెటిజన్ల ఆగ్రహం
హైదరాబాద్: అమెరికాలో ఉన్నప్పుడు కేటీఆర్ ఇంట్లో గిన్నెలు శుభ్రం చేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నారైలు అయితే.. ఉత్తమ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ను అవమానించారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఉత్తమ్ వ్యాఖ్యలకు కేటీఆర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నెటిజన్లు కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు.
డియర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
డియర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను కూడా అమెరికాలో నా గిన్నెలు తోముకున్నానని, నేను డిగ్నిటీ ఆఫ్ లేబర్ను గౌరవిస్తానని అప్పిరెడ్డి అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
నా ప్లేట్ నేనే శుభ్రం చేసుకుంటున్నా
నేను యూకేలో నివసిస్తున్న ఎన్నారైని అని, ఎంబీయే.ఎంస్ చేస్తున్నానని చాడ సృజన్ రెడ్డి అనే నెటిజన్ ట్వీట్ చేశారు. ఉత్తమ్ గారూ.. నేను తిన్న తర్వాత నా ప్లేట్ నేను శుభ్రం చేసుకుంటానని, అయితే నేను అనర్హుడినా అని ప్రశ్నించారు.
ఆ రోజు నేను కిచెన్లో
నా స్నేహితులందరికీ తెలుసునని, ఆదివారం నేను కిచెన్లో ఉంటానని, నా భార్యకు సహకరిస్తానని అనిల్ కూర్మాచలం అనే నెటిజన్ పోస్ట్ చేశారు. మరెందరో వరుసగా 'ఐ యామ్ డిష్ వాషర్', 'డిగ్నిటీ ఆఫ్ లేబర్' పేర్లతో ట్వీట్లు చేశారు
కేటీఆర్ ఘాటు ట్వీట్
అమెరికాలో ఉన్నప్పుడు ప్రతి భారతీయుడిలాగే తానూ ఇంట్లో గిన్నెలు శుభ్రం చేశానని కేటీఆర్ చెప్పారు. అమెరికాలో ఉండే భారతీయులు అందరూ వారి పనులు వారే చేసుకుంటారన్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా కూడా ఇంట్లో గిన్నెలు శుభ్రం చేసేవారన్నారు. మీ పప్పు (రాహుల్ గాంధీ)లా కాకుండా కష్టపడి సంపాదించిన డబ్బుతో గౌరవప్రదమైన జీవితం గడిపానని చెప్పారు. నీ మాదిరి దోచుకోలేదని, నీ కారులో డబ్బులు తగులబడిన విషయం అందరికీ గుర్తుందన్నారు. గత ఎన్నికల్లో ఉత్తమ్ వాహనంలో రూ.రెండున్నర కోట్ల కరెన్సీ తగులబడిందన్న వార్తా కథనాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.