జయసుధపై కాంగ్రెసు గుర్రు: పవన్ కళ్యాణ్పై మరోసారి విహెచ్ ఫైర్
హైదరాబాద్: తన కుమారుడు శ్రేయాన్ బస్తీ ఆడియో విడుదల కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఆహ్వానించడంపై తమ పార్టీ నేత, సినీ నటి జయసుధపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (టిపిసిసి) నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆమెను నియోజకవర్గం బాధ్యతల నుంచి తప్పించాలని టిపిసిసి యోచిస్తున్నట్లు సమాచారం. ఆమె సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం ఇంచార్జీగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఆమె ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
కాగా, జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్పై కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు మరోసారి మండిపడ్డారు. నోటుకు ఓటు కేసుపై పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అడిగారు. అవినీతిపై ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసులో చంద్రబాబు వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ నోరు విప్పాలని ఆయన సోమవారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.
ఓటుకు నోటు కేసును చంద్రబాబు నీరు గార్చే ప్రయత్నం చేస్తే తాము ప్రజల్లోకి వెళ్తామని ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దేవాలయాలు తిరగడం మానేసి రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. హైదరాబాదులో హార్స్ రేసింగ క్లబ్బులను మూయించాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
సాధారణ ఎన్నికలకు ముందు నగరంలోని సెటిలర్లపై నిప్పులు చెరిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇప్పుడు వారిని మెప్పించే ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెసు నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. ఆ విధంగా కెసిఆర్ ఊసరవెల్లిని తలపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
అయ్యప్ప సొసైటీ, ఎన్ కన్వెన్షన్ నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయంటూ అసెంబ్లీ హౌస్ కమిటీని నియమించిన కెసిఆర్ ఆ నిర్మాణాలను కేబినెట్లో పెట్టి క్రమబద్దీకరిస్తామని చెప్పడం కెసిఆర్ రంగులు మార్చే రాజకీయాలకు నిదర్శనమని ఆయన అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల కోసమే కెసిఆర్ మాట మారుస్తున్నారని ఆయన అన్నారు.
తెలుగు చలనచిత్ర రంగానికి కెసిఆర్ బస్తీ ఆడియో విడుదల వేడుకల్లో హామీలు ఇవ్వడం కూడా జిహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిందేనని ఆయన అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రచార ఆర్భాటం మాత్రమేనని ఆయన విమర్శించారు. జిహెచ్ఎంసి కమిషనర్ ప్రభుత్వ ఏజెంటుగా పనిచేస్తున్నారని, సిఎం కెసిఆర్ ఇంటి వద్ద మాత్రమే పారిశుద్ధ్య కార్యక్రమం చేపడుతున్నారని షబ్బీర్ అలీ అన్నారు.