స్పీకర్ నిర్ణయంపై కోర్టుకు, 48 గంటల దీక్షకు కోమటిరెడ్డి, సంపత్కుమార్
Recommended Video
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ల శాసనసభ్యత్వాన్ని రద్దు చేయడంపై కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. మరో వైపు ఈ వ్యవహరంపై శాసనసభ్యత్వాన్ని రద్దు చేయడంపై 48 గంటల పాటు దీక్షకు దిగాలని కోమటిరెడ్డి, సంపత్ కుమార్ నిర్ణయం తీసుకొన్నారు.
అసెంబ్లీలో హెడ్పోన్ విసిరిన కోమటిరెడ్డి, గాయపడిన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం సాగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెడ్ఫోన్ విసరడంతో శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ కంటికి గాయమైంది.
శాసనమండలి చైర్మెన్ స్వామిగౌడ్ను గాయపర్చినందుకు గాను కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది.అంతేకాదు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ల శాసనసభ్యత్వాలను రద్దు చేస్తూ మంగళవారం నాడు నిర్ణయం తీసుకొన్నారు.
కోర్టును ఆశ్రయించనున్న కాంగ్రెస్
గవర్నర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనుచితంగా వ్యవహరించినందుకుగాను ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది, మరో ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకొంది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మార్చి 13న కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయం తీసుకొన్నారు.
48 గంటల దీక్షకు కోమటిరెడ్డి, సంపత్ కుమార్
నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సభ్యత్వాలను రద్దు చేయాలని తీసుకొన్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. ఈ పరిణామాలను నిరసిస్తూ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు 48 గంటల పాటు దీక్షకు దిగాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఈ రెండు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు హైద్రాబాద్కు తరలివస్తున్నారు.
కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల సమావేశం
కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల సమావేశం మరోసారి మంగళవారం సాయంత్రం గాంధీభవన్లో జరగనుంది. తెలంగాణ అసెంబ్లీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఇప్పటికే అనుసరించాల్సిన వ్యూహంపై ఇతర పార్టీలతో కూడ కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించారు.
అసెంబ్లీ వెలుపల కార్యాచరణపై కాంగ్రెస్ కసరత్తు
అసెంబ్లీ వెలుపల అనుసరించాల్సిన కార్యాచరణపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎష్ అనుసరిస్తున్న విధానాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే మండలకేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దీనికితోడు మరిన్ని కార్యక్రమాలతో టిఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం తీసుకురావాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.