కోమటిరెడ్డికి రెండోసారి షోకాజ్ నోటీసులు..24గంటల్లోగా వివరణ ఇవ్వాలన్న క్రమశిక్షణ కమిటీ
హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మరో షోకాజ్ నోటీస్ పంపింది కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ. మునుగోడులో కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జ్ కుంతియాపై ఇంకా ఇతరత్రా నేతలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు పంపింది కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ. అయితే ఇందుకు సమాధానంగా తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి వివరణతో సంతృప్తి చెందని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మళ్లీ షోకాజ్ నోటీసులు పంపిస్తూ 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
టికెట్లు అమ్ముకునేవారు నోటిసులిస్తారా?
గత శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో లో క్రమశిక్షణ కమిటీపై రాజగోపాల్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. తనకు నోటీసులు ఇచ్చే అర్హత క్రమశిక్షణ కమిటీ ఉందా? అంటూ రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. పీసీసీ కమిటీల్లో బ్రోకర్లు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఈవిధంగా కమిటీలను, కమిటీలు ఏర్పాటు చేసిన అధిష్టానాన్ని తన వ్యాఖ్యలతో రాజగోపాల్రెడ్డి అవమాన పరిచారని టీపీసీసీ భావిస్తోంది.పార్టీలో నేతలు క్రమశిక్షణతో ఉండాలనే లేదంటే, చర్యలు తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. కార్యకర్తల శ్రమతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని అన్నారు. ఎన్నికల సమయంలో నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరికాదని ఉత్తమ్ హితవు పలికారు.
ఇదిలా ఉంటే పార్టీలో జరిగే విషయాలు తనలాంటి వ్యక్తులు మాట్లాడితేనే పార్టీకి పరిస్థితి తెలుస్తుందని మీడియా సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించి గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని పార్టీకి సూచించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రజలు, కార్యకర్తల మనోభావాలు తెలుసుకోండని అన్నారు. గాంధీభవన్లో కూర్చుని ప్రెస్ మీట్లు ఇస్తే సరిపోదని సొంతపార్టీ నేతలకు చురకలంటించారు.