కాంగ్రెస్ అసంతృప్తులు, రంగంలోకి పెద్దలు: హోటల్ నుంచి కోపంతో వెళ్లిన శారద, పార్టీకి శంకరరావు గుడ్బై
హైదరాబాద్: పార్టీ రెబల్స్ను కాంగ్రెస్ పార్టీ నేతలు బుజ్జగిస్తున్నారు. హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్కు అసంతృప్త నేతలను పిలుస్తున్నారు. అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం నారాయణ స్వామి, కృష్ణారావు, డీకే శివకుమార్లతో కూడిన సభ్యులను రంగంలోకి దింపింది. అసంతృప్త నేతలు ఆదివారం ఉదయం నుంచి వారితో భేటీ అవుతున్నారు.
టిక్కెట్కు 3 కోట్లు డిమాండ్, ఆడియో: కాంగ్రెస్ నేత సంచలనం, రాహుల్ ఇంటి వద్ద కార్తీక రెడ్డి ధర్నా
పొన్నాల లక్ష్మయ్య, పాల్వాయి స్రవంతి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, వి హనుమంత రావు, నాయిని రాజేందర్ తదితరులు భేటీ అయ్యారు. పలువురు నేతలు పార్టీకి చేసిన సేవలను ప్రశంసిస్తూనే, ఈసారి పోటీపై వెనక్కి తగ్గాలని అధిష్టానం రంగంలోకి దింపిన నేతలు సూచిస్తున్నారు. తాను పార్టీకి వ్యతిరేకంగా పని చేయనని పాల్వాయి స్రవంతి చెప్పగా, వరంగల్ వెస్ట్ సీటు తనకు ఇవ్వాల్సిందేనని నాయిని రాజేందర్ తేల్చి చెప్పారు.
హోటల్ నుంచి కోపంతో వెళ్లిపోయిన శారద
మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శారద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ సీనియర్లను కలిసేందుకు ఆమె హోటల్కు వచ్చారు. పార్టీ కనీసం తనను పరిగణలోకి తీసుకోలేదని వాపోయారు. ఆ తర్వాత కాసేపటికి ఆమె పార్క్ హయత్ హోటల్ నుంచి కోపంగా వెళ్లిపోయారు. గ్రేటర్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి కూడా వారిని కలిశారు. మరోవైపు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇబ్రహీంపట్నం ఇంచార్జ్ మల్రెడ్డి రంగారెడ్డి కలిశారు.
రెబల్స్ రంగంలోకి దిగితే కూటమికి నష్టం
అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు అన్నారు. కూటమి వల్ల కొన్ని సీట్లు త్యాగం చేయవలసి వచ్చిందని చెప్పారు. రెబల్గా పోటీ చేస్తే కూటమి లక్ష్యం నెరవేరదని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక అసంతృప్తులకు న్యాయం జరగాలన్నారు. మనం కుమ్ములాడుకుంటే కేసీఆర్కే లాభమని చెప్పారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు కూడా టిక్కెట్ ఆలస్యంగా ఇచ్చారని చెప్పారు. కోదండరాం కూడా త్యాగం చేశారని చెప్పారు. సోనియా గాంధీ షెడ్యూల్కు ముందే వస్తే బాగుండేదని చెప్పారు. పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి న్యాయం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో వెంకటస్వామి లబ్ధి పొందినట్లు ఎవరూ లాభపడలేదని చెప్పారు. శంకర రావు పార్టీ మారడం వెనుక ఆయన బావమరదుల హస్తం ఉందని ఆరోపించారు.
పొంగులేటి తీవ్ర అసంతృప్తి
తనకు 2014లో సీపీఐ పార్టీతో పొత్తుతో నష్టం చేశారని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తుతో నష్టం చేశారని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెండుసార్లు తనకు రాజకీయంగా చాలా నష్టం చేశారన్నారు.
క్యామ మల్లేష్కు షోకాజ్ నోటీసులు
స్క్రీనింగ్ కమిటీ సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేసిన క్యామ మల్లేష్కు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశముంది. భక్తచరణ్ దాస్ ఓ నియోజకవర్గానికి రూ.3 కోట్లు అడిగినట్లుగా చెబుతున్న ఆడియో టేప్ ఉందని క్యామ మల్లేష్ సంచలన ఆరోపణలు చేసారు. ఇందుకు సంబంధించిన ఆడియో తన వద్ద ఉందని ఇందుకు సంబంధించిన టేప్ విడుదల చేస్తానని చెప్పారు. ఇబ్రహీంపట్నం నుంచి టిక్కెట్ ఇచ్చేందుకు తన నుంచి రూ.3 కోట్లు అడిగారన్నారు. ఈ డబ్బును భక్తచరణ్ దాస్ కొడుకు డిమాండ్ చేశారన్నారు. ఈ ఆరోపణలకు గాను ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు.
కాంగ్రెస్ పార్టీకి శంకర రావు గుడ్ బై
మాజీ మంత్రి శంకర్ రావు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. రెడ్లకు కేటాయించినన్ని సీట్లు బీసీలకు ఇవ్వరా అని ప్రశ్నించారు. విధేయులకు పార్టీలో చోటు లేదని చెప్పారు. నన్ను బలిపశువును చేశారని మండిపడ్డారు.