మహాకూటమి సీట్ల లెక్క తేలింది, ఏ పార్టీకి ఎన్ని అంటే?: కోదండకు ఢిల్లీ పిలుపు, కాంగ్రెస్లో గట్టిపోటీ
Recommended Video
హైదరాబాద్/ఢిల్లీ: యూపీఐ చైర్ పర్సన్ సోనియా గాంధీ నివాసంలో గురువారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సెలక్షన్ కమిటీ సమావేశం సాయంత్రం ముగిసింది. 74 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు.
ముఖ్యమంత్రి పదవి, హరీష్ రావుపై వంటేరు వ్యాఖ్యలు, విభేదాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
అలాగే, మహాకూటమి పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనేది తేల్చారు. తెలంగాణ జన సమితికి 8, తెలుగుదేశం పార్టీకి 14, సీపీఐకి 3 సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. 93 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. ఓ స్థానం తెలంగాణ ఇంటి పార్టీకి ఇస్తుంది. భాగస్వామ్య పార్టీలకు 26 స్థానాలు కేటాయిస్తోంది.
ఎవరికి ఎన్ని సీట్లు అంటే?
దీనిపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ ఆర్సీ కుంతియా మాట్లాడారు. టీడీపీకి 14, కోదండరాం పార్టీకి ఎనిమిది, సీపీఐకి 3 సీట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీన ఉదయం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. తమ పార్టీలో 74 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిపారు. మిగిలిన అభ్యర్థుల కోసం 11, 12వ తేదీల్లో స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశం కానుంది. మరోవైపు కోదండరాంకు ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది.
కాంగ్రెస్లో పోటాపోటీ
కాంగ్రెస్ పార్టీ పదిహేను నియోజకవర్గాలు మినహా అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ స్థానాల్లో గట్టి పోటీ ఉంది. ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పోటీలో ఉన్నారు. టిక్కెట్ ఆశించి భంగపడ్డవారు ఎదురు తిరగకుండా, ఎవరికి టిక్కెట్ ఇవ్వాలనే అంశంపై ఆశావహులతో ఢిల్లీలో మాట్లాడింది.
15 నియోజకవర్గాల్లో తీవ్రపోటీ
15 నియోజకవర్గాల్లోనే తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. వీటిపై కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ ఒక్కో స్థానంలో రెండు పేర్లను సిఫార్సు చేసింది. వారిని పిలిపించి గురువారం మాట్లాడింది. ఈ అంశం కొలిక్కి రాలేదు. మరో మూడు నాలుగు రోజుల్లో ఈ అంశానికి ముగింపు పలకాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు.
ఒక కుటుంబంలో రెండు సీట్లు ఇస్తారా?
ఈ పదిహేను నియోజకవర్గాల్లోని కొన్ని చోట్ల కుటుంబంలోని రెండో వ్యక్తి కూడా రేసులో ఉన్నారు. మునుగోడి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాజేంద్ర నగర్ నుంచి కార్తీక్ రెడ్డి, మిర్యాలగూడ నుంచి రఘువీర్లు ఉన్నారు. కానీ ఇప్పటికే కోమటిరెడ్డి సోదరుడు వెంకట రెడ్డి, కార్తీక్ రెడ్డి తల్లి సబితా ఇంద్రా రెడ్డి, రఘువీర్ తండ్రి జానారెడ్డిలు వేరే స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక కుటుంబంలో రెండు స్థానాలపై తర్జన భర్జన పడుతోంది. డీకే అరుణ కూతురు కూడా మక్తల్ నుంచి పోటీకి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆశావహులను ఎదురెదురుగా కూర్చోబెట్టి మాట్లాడారు.