అదే జరిగితే తెలంగాణ కాంగ్రెస్ భూస్తాపితమేనా..! రెండు తెలుగు రాష్ట్రాల్లో చాప్టర్ క్లోస్..!!
ఢిల్లీ/హైదరాబాద్ : వరుస పరజయాలు, అధినాయకత్వ లోపం, ఉన్న నేతల మద్య విభేదాలతో కొట్టు మిట్టాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భవిశ్యత్తు అంధాకారంగా మారబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మూడు ఎంపీ స్థానాలు గెలుచుకున్న తర్వాత ఏదో చేస్తారని మిణుమిణుకుమన్న ఆశ కాస్త చేజారిపోతోంది. తెలంగాణ ఇచ్చామని ఘనంగా గొప్పలు పోతున్న కాంగ్రెస్.. ఇప్పుడు అదే తెలంగాణలో కనుమరుగయ్యే పరిస్ధితులు నెలకొన్నాయి. వరుసగా నాయకులందరూ కాడిని వదిలేసి పోతుంటే.. ఏ చేయాలో తెలియని సారథులు దిక్కుతోచక కూర్చున్నారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, జగ్గారెడ్డి బీజేపీలో చేరే దిశగా ప్రయత్నాలు మొదలుపెడుతుండగా.. మరో ఎమ్మెల్యే కూడా కమల తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్కు ఇంతటి దారుణమైన స్థాయికి ఎందుకు దిగజారిపోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
జగన్తో కేసీఆర్ భేటీ: నాడు జగన్ పిలుపు..నేడు కేసీఆర్ ఆహ్వానం : వారిద్దరి మధ్య ఇదే చర్చ..!
తెలంగాణ ఇచ్చిన పార్టీకి మిగిలింది మొండిచెయ్యే..! దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ నేతుల..!!
2014లో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లింది. అయితే.. ఇచ్చిన పార్టీ కంటే తెచ్చిన పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. ఆ తర్వాత తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడంతో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలపై పోరాటం చేస్తున్నామన్న అంచనాతో న్యాయస్థానాల్లో కేసులు వేసింది. అయితే.. అది తిరిగి తిరిగి కాంగ్రెస్ మెడకే చుట్టుకున్నాయి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వేసిన కేసులు ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచింది టీఆర్ఎస్. దానివల్ల ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలు అందకుండాపోయాయంటూ విమర్శలు గుప్పించింది. ఉదాహరణకు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రైతుబంధు సాయం పంపణీ విషయానికి వద్దాం. ఈ పథకంపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ప్రతిపక్ష స్ధాయి కోల్సోయిన కాంగ్రెస్..! నడిపించే నాయకుడు ఎక్కడ..!!
రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి వచ్చింది. చాలామందికి రైతులకు అకౌంట్ల నంబర్లు, ఆన్లైన్ సౌకర్యం లేకపోవడంతో అవి జమకాలేదు. ఇక బతుకమ్మ చీరల పంపణి పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల ప్రభుత్వంపై విజయం సాధించామని కాంగ్రెస్ చెప్పుకొన్నా.. ప్రజల్లో మాత్రం కాంగ్రెస్పై వ్యతిరేకత ఏర్పడింది. తమకు అందాల్సిన ప్రయోజనాలు కాంగ్రెస్ చేసిన ఫిర్యాదులతో అందకుండాపోయాయని భావించారు. ఇన్నాళ్లూ బద్ధ శత్రువులుగా ఉన్న టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కూడా ప్రజలు హర్షించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వరుసగా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారెక్కడం ప్రారంభించారు. వారిని బుజ్జగించి కాంగ్రెస్లొ కొనసాగేలా చేయడం కంటే వెళ్లిన వారిపై విమర్శలకే నాయకత్వం ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చింది. అలాగే నాయకులు కూడా ఎవరికి వారు తమ పదవులు కాపాడుకునే పనిలో పడి.. వలసలను ఆపలేకపోయారు. 19 మంది ఎమ్మెల్యేలు గెలవగా 12 మంది గులాబీ పార్టీలోకి మారిపోయారు. ఇక ఉత్తమ్కుమార్రెడ్డి ఎంపీగా ఎన్నికవ్వడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
ఇక మిగిలింది ముగ్గురేనా..! వారు కూడా వెళ్లిపోతే కథ సమాప్తమే..!!
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, జగ్గారెడ్డి కూడా కాంగ్రెస్ను వీడేందుకు దాదాపుగా నిర్ణయించుకున్నారు. వాస్తవానికి జగ్గారెడ్డి తెరాసలోకి వెళ్లాలని భావించినా.. ఆయన్ను చేర్చుకునేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఎటూ పాలుపోని పరిస్థితిల్లో బీజేపీలో నుంచి కాంగ్రెస్లో చేరిన జగ్గారెడ్డి తిరిగి బిజేపీ గూటికి చేరాలని భావిస్తున్నారు. ఇక మునుగోడు నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలోకి వెళ్లడం దాదాపు ఖాయమైంది. వీరితోపాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే ఎంపీలుగా గెలిచిన రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. జాతీయ స్థాయిలో ఫిరాయింపుల విషయంలో తలెత్తే ఇబ్బందుల దృష్ట్యా తటపటాయిస్తున్నట్లు తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ జీరో..! ఇప్పట్లో కోలికునే పరిస్థితులు లేవు..!!
పార్టీ మారినా అనర్హత వేటు పడకుండా ఉండేలా ప్రణాళిక రూపొందించుకుని ఒక ఒప్పందం కుదిరాకే బీజేపీలొకి వెళ్లాలనిభావిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరూ కూడా కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆమరణ దీక్ష చేసినప్పుడు కూడా కంటితుడుపుగా వచ్చి మద్దతు పలికి వెళ్లిపోయారు. గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు కాంగ్రెస్కు దూరంగా ఉండిపోయారు. 19 ఎమ్మెల్యేల బలం కాస్త ఇప్పుడు 3కు చేరింది మరోవైపు జిల్లా పరిషత్ల పరంగా 32 జిల్లాల్లో ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవలేదు. మండల పరిషత్లది అదేబాట. త్వరలో మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అక్కడ అదే ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో ప్రధాన పదవిలో ఉన్న నేతలు మినహాయించి దాదాపు జీరో అవుతుతున్న పరిస్థితి నెలకొంది.