కేసీఆర్కు దాసోజు శ్రవణ్ షాక్: సింగరేణిలో సత్యం తరహా భారీ స్కాం, ఇదీ లెక్క
సింగరేణి కాలరీస్లలో కోట్లాది రూపాయల అవినీతి జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ఆయన బుధవారం ఈ మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కు లేఖ కూడా రాశారు.
హైదరాబాద్: సింగరేణి కాలరీస్లలో కోట్లాది రూపాయల అవినీతి జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ఆయన బుధవారం ఈ మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కు లేఖ కూడా రాశారు.
దొంగలు దొంగలు దేశాన్ని పంచుకున్నట్లుగా సింగరేణి యాజమాన్యం, టిఆర్ఎస్ పార్టీ, టిజిబికెఎస్ సంఘం నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. నిధుల దుర్వినియోగంపై తమకు సమాచారం ఉందన్నారు.
భారీ అక్రమాలు.. 1490 కోట్లకు 74 లక్షల టన్నులు మాత్రమే
నియామకాలు, ప్రొక్యూర్మెంట్లలలో యాజమాన్యం, టిఆర్ఎస్ అనుబంధ సంఘం నాయకులు కలిసి అవకతవకలు చేశారని శ్రవణ్ ఆరోపించారు. మైనింగ్ ఏరియాల వారిగా 11 ప్రాంతాల్లో ఉన్న మొత్తం బొగ్గు విలువ 1490 కోట్లు ఉండాలని అయితే 74 లక్షల టన్నుల బొగ్గు ఉందని సింగరేణి యాజమాన్యం అధికారిక లెక్కల్లో చెప్పిందని మండిపడ్డారు. కానీ తీరా పరిశీలిస్తే అందులో పది శాతం కూడా లేదన్నారు.
ఈ తేడా ఏమిటో చెప్పండి
మరి ఈ లెక్కల్లో తేడాలు ఎలా వచ్చాయో చెప్పాలని శ్రవణ్ ప్రశ్నించారు. రికార్డులలో తప్పులపై విచారణ చెయ్యాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు. బొగ్గు రికార్డుల్లో ఉందని, మరి క్షేత్రస్థాయిలో ఎందుకు లేదని నిలదీశారు. అసలు ఏం జరిగిందో చెప్పాలన్నారు.
సత్యం కంప్యూటర్స్ లెక్కల్లా
ఒక టన్ను బొగ్గు తీయాలంటే 12 టన్నుల మట్టి తీయాలని మరి ఆ లెక్కలు ఎందుకు లేవని శ్రవణ్ ప్రశ్నించారు. సింగరేణిలో లెక్కలు మరో సత్యం కంప్యూటర్స్ లెక్కల్లా ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే కోల్ మంత్రి, సెక్రటరీ, ఏసీబీ, సిబిఐ, సీఎస్లకు లేఖ రాసినట్లు వెల్లడించారు.
సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకం
సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని శ్రవణ్ ఆరోపించారు. యాజమాన్యంతో కుమ్మక్కైన దొంగ సంస్థ టీబీజీకేఎస్ కార్మిక సంఘమని మండిపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ తీసుకొని, అలా వచ్చిన డబ్బుతో సింగరేణిలో ఓటర్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారన్నారు.