తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతను బలి తీసుకున్న కరోనా: అనుచరుల్లో ఆందోళన: హోమ్ క్వారంటైన్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.రోజూ పలువురు పేషెంట్లు కరోనా బారిన పడి మరణిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్కే చెందిన సీనియర్ నాయకుడు, టీపీసీసీ కార్యదర్శి జీ నరేందర్ యాదవ్ కరోనా వైరస్కు బలి అయ్యారు. కరోనా వల్ల అనారోగ్యానికి గురైన ఆయన సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మరణించారు. కరోనా వల్ల ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Recommended Video
చేతులు కాలాక: పింక్ సీన్ రివర్స్: జైపూర్కు కాంగ్రెస్ పెద్దలు: మైనారిటీలో: 109 మంది బలం?
నరేందర్ యాదవ్ మరణించడం కాంగ్రెస్ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా బాధితుల సహాయ కార్యక్రమాల్లో ఆయన తరచూ పాల్గొంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించిన పలు సహాయ కార్యక్రమాల్లో ఆయన విస్తృతంగా పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయనకు కరోనా వైరస్ సోకి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఇటీవలే అనారోగ్యానికి గురైన ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారు జామున మరణించారు.
కాంగ్రెస్ నిర్వహించిన కార్యక్రమాల్లో నరేందర్ యాదవ్తో కలిసి పాల్గొన్న నేతలు, కార్యకర్తల్లో భయందోళనలు వ్యక్తమౌతున్నాయి. నరేందర్ యాదవ్ కాంటాక్టులను గుర్తిస్తున్నారు. నరేందర్ యాదవ్ అనుచరులు కొందరు ఇప్పటికే ఆసుపత్రుల్లో చేరినట్లు తెలుస్తోంది. పలువురికి కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. నరేందర్ యాదవ్కు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయిన వెంటనే కుటుంబ సభ్యులు సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. వారంతా ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్లో ఉన్నారు. అదే సమయంలో నరేందర్ యాదవ్ మరణించారనే వార్త తెలిసి విషాదంలో మునిగిపోయారు.
కొద్దిరోజుల కిందటే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు కరోనా వైరస్ వల్ల అనారోగ్యానికి గురయ్యారు. కొద్దిరోజుల్లోనే ఆయన కోలుకున్నారు. ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వెళ్లారు. టీఆర్ఎస్కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కరోనా వైరస్కు బారిన పడ్డారు. హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సహా తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. గంటగంటకూ బలపడుతోంది. రోజూ వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అందులో గ్రేటర్ హైదరాబాద్లో నమోదవుతున్న కేసుల సంఖ్యే అధికంగా ఉంటున్నాయి.