మానవ అక్రమ రవాణా?: ఆ ఫ్యామిలీని అమెరికాలోనే వదిలేశారు, జగ్గారెడ్డి అరెస్ట్
Recommended Video
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(తూర్పు జయప్రకాష్ రెడ్డి)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్యా పిల్లల పేరుతో ఇతరులను అమెరికాకు తీసుకెళ్లి వారిని అక్కడే వదిలి వచ్చారనే ఆరోపణలపై జగ్గారెడ్డిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు.
భారీగా డబ్బు తీసుకున్నట్లు అంగీకారం: జగ్గారెడ్డిపై 8సెక్షన్ల కింద కేసులు, 25 వరకు రిమాండ్
ఫ్యామిలీలో అమెరికాకు వెళ్లి.. ఒక్కరే వచ్చారు..
పటాన్చెరులో ఓ కార్యక్రమంలో ఉండగా జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హైదరాబాద్కు తరలించారు. తాను, తన భార్య, ఇద్దరు పిల్లలు అమెరికాకు వెళ్తున్నామంటూ పద్నాలుగేళ్ల క్రితం జగ్గారెడ్డి నలుగురికి పాస్పోర్టులు తీసుకున్నారని, ఆ పర్యటన అనంతరం ఆయన ఒక్కరే తిరిగి వచ్చారంటూ సోమవారం ఓ వ్యక్తి సికింద్రాబాద్లోని మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అది గుజరాత్కు చెందిన కుటుంబం..
ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. జగ్గారెడ్డి అమెరికాకు వెళ్లినప్పుడు తన భార్య, పిల్లలతో కాకుండా గుజరాత్కు చెందిన యువతి, ఆమె ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి అక్కడే వదిలేశారని గుర్తించారు. తప్పుడు వివరాలతో వారిని అమెరికాకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
మానవ అక్రమ రవాణా?
ఇది మానవ అక్రమ రవాణా చట్టరీత్యా నేరమైనందున కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. జగ్గారెడ్డి అమెరికాకు తీసుకెళ్లింది ఎవరిననే విషయమై విచారణ జరుపుతున్నారు. పక్కా ఆధారాలతోనే జగ్గారెడ్డిని అరెస్ట్ చేసినట్లు నార్త్ జోన్ డీసీపీ సుమతి తెలిపారు. రాజకీయ ఆరోపణల్ని ఆమె కొట్టిపారేశారు. ఫేక్ పాస్ పోర్టులతో అమెరికా వీసా దరఖాస్తు చేసి ఆ ఫ్యామిలీని అమెరికాకు అక్రమ రవాణా చేశారని డీసీపీ తెలిపారు. ఆ ముగ్గురిని అమెరికా తీసుకెళ్లడానికి జగ్గారెడ్డి భారీగా డబ్బులు(రూ.15లక్షలు) తీసుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇది కక్ష సాధింపు చర్యే
ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పుంజుకుంటుందనే తనను అరెస్ట్ చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఇది కేసీఆర్, హరీశ్ రావు కుట్రలో భాగమేనని అన్నారు. కేసీఆర్ పైనా అక్రమ పాస్ పోర్ట్ కేసులున్నాయని అన్నారు. తాను ఎలాంటి నేరం చేయలేదని అన్నారు. ఇది ఇలా ఉంటే, 2004లో తప్పుడు పత్రాలు సమర్పిస్తే ఇప్పటివరకు అధికారులు ఏం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా పనిచేసిన జగ్గారెడ్డిని పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చి అరెస్టు చేయాల్సిన పని ఏమొచ్చిందని నిలదీశారు. అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఉత్తమ్కుమార్రెడ్డి సోమవారం అర్ధరాత్రి డీజీపీ మహేందర్రెడ్డిని కలిసి ఈ విషయమై మాట్లాడినట్లు తెలిసింది. ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా జగ్గారెడ్డి అరెస్ట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తనకు, తన పిల్లలకు అసలు పాస్ పోర్టు లేదని జగ్గారెడ్డి భార్య చెబుతుండటం గమనార్హం.