గవర్నర్గా జానారెడ్డి?: సాగర్ ఉప ఎన్నికలో కుమారుడు? బీజేపీ ప్లాన్: హస్తినలో అనూహ్య పరిణామాలు
హైదరాబాద్: తెలంగాణలో బలపడటం మీదే భారతీయ జనతా పార్టీ ఫోకస్ మొత్తం ప్రస్తుతం కేంద్రీకృతమైనట్టు కనిపిస్తోంది. సిద్ధిపేట్ జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికలో ఘన విజయాన్ని సాధించడం.. ఆ వెంటనే ఎదురైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అద్భుత ఫలితాలను సాధించిన ఊపును ఇక ముందు కూడా కొనసాగించడానికి కసరత్తు సాగిస్తోంది. ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడూ కాదు.. అనే స్ఫూర్తితో పోరాటాన్ని చేపట్టింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఢీ కొట్టి ఎదురు నిలిచేలా పక్కా ప్రణాళికలను రచిస్తోంది.
Recommended Video
APPSC Group-1 mains: నిరుద్యోగులకు శుభవార్త: షెడ్యూల్ ఇదీ: హెల్ప్డెస్క్ నంబర్లు ఇవీ
నాగార్జున సాగర్పై దృష్టి..
ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నేతల దృష్టి మొత్తం నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ మీద ఉంది. ఈ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో ఎలా విజయం సాధించాలనే అంశంపై పావులు కదుపుతోంది. ఇప్పటికే- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయాన్ని పరిశీలిస్తోంది. ఇదివరకు జానారెడ్డి.. ఇదే అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహించిన నేపథ్యంలో.. ఆయనను చేర్చుకోవడం వల్ల నాగార్జున సాగర్లో తమ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందనే అభిప్రాయంలో ఉంది బీజేపీ.
గవర్నర్ పదవి.. కుమారుడికి టికెట్
బీజేపీలో చేరడానికి జానా రెడ్డి కొన్ని డిమాండ్లను ఆ పార్టీ నేతల ముందు ఉంచారు. అందులో ఒకటి.. తన కుమారుడు రఘువీర్ రెడ్డికి నాగార్జున సాగర్ టికెట్ ఇవ్వడం. రెండు- తనకు గవర్నర్ పదవి. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తాను తప్పుకోవాలని భావిస్తున్నానని, అందుకే తనకు ఏదైనా ఓ రాష్ట్రానికి గవర్నర్గా పంపించాలనే డిమాండ్ను జానారెడ్డి బీజేపీ నేతల ముందు ఉంచారని అంటున్నారు. తన వారుసుడిగా రఘువీర్ రెడ్డిని గుర్తించాలని, ఆయనకు నాగార్జున సాగర్ టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుబట్టారని తెలుస్తోంది.
హస్తిన చేరిన బండి సంజయ్..
కాంగ్రెస్ నుంచి ఫిరాయించడానికి జానా రెడ్డి తమ ముందు ఉంచిన డిమాండ్ల చిట్టాను తీసుకుని బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ హస్తినకు చేరుకున్నారు. త్వరలో ఆయన పార్టీ అధిష్ఠానాన్ని కలుసుకోనున్నారు. జానా రెడ్డి డిమాండ్లను ఆయన వారికి వివరించనున్నారు. దీనికి బీజేపీ అధిష్ఠానం అంగీకరించడమంటూ జరిగితే.. ఇక జానా రెడ్డి కాంగ్రెస్కు గుడ్బై చెప్పడం, కాషాయ కండువాను భుజాన వేసుకోవడం లాంఛనప్రాయమే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తెలంగాణలో దయనీయంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్లో కొనసాగడం వల్ల రాజకీయంగా ఎలాంటి ఉపయోగం ఉండబోదనే నిశ్చితాభిప్రాయానికి జానా రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ను ఢీ కొట్టడానికి..
తెలంగాణలో బీజేపీ బలపడుతోందనడానికి దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిరూపించాయి. ఈ రెండు చోట్ల తాము సాధించిన గెలుపు ఏ మాత్రం గాలివాటం కాదని నిరూపించుకోవాల్సిన అవసరం బీజేపీకి ఏర్పడింది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత వల్ల ఖాళీ అయిన నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని కూడా తాము కైవసం చేసుకోవడం ద్వారా.. ఇక తమకు తిరుగు ఉండబోదనే సంకేతాలను ఇవ్వాలని బీజేపీ పట్టుదలతో కనిపిస్తోంది. అందుకే విజయం సాధించడానికి అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వృధా చేసుకోదలచుకోలేదని అంటున్నారు.
సాగర్పై గట్టిపట్టు..
నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజక వర్గంపై జానా రెడ్డి గట్టిపట్టు ఉంది. 2009లో ఈ నియోజకవర్గం ఆవిర్భవించింది. వరుసగా రెండుసార్లు జానా రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచీ ఆయన కాంగ్రెస్తో అంటీముట్టనట్టుగానే ఉంటూ వచ్చారు. తాజాగా నోముల నర్సింహయ్య కన్నుమూయడంతో మళ్లీ ఆ నియోజకవర్గ రాజకీయాల్లో కదలికలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి జానా రెడ్డి సుముఖంగా లేరు.
బీజేపీ నామమాత్రమే..
నిజానికి నాగార్జున సాగర్పై బీజేపీకి పెద్దగా పట్టు లేదు. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన కంకణాల నివేదితకు పడ్డ ఓట్లు 2,675 మాత్రమే. పెద్దగా పట్టు లేకపోయినప్పటికీ.. ఈ నియోజకవర్గాన్ని గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. అందులో భాగంగానే.. ఇక్కడి నుంచి రెండుసార్లు గెలుపొందిన జానా రెడ్డికి గాలం వేసింది. జానా రెడ్డి బీజేపీకి మద్దతు ఇవ్వడమంటూ జరిగితే.. పోటీ రసవత్తరంగా మారుతుంది. టీఆర్ఎస్ మరోసారి చెమటలు ఓడ్చాల్సిన పరిస్థితిని ఎదుర్కొనక తప్పదు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా దుబ్బాక తరహా ఫలితం ఇక్కడా వెలువడుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.