ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వరం రద్దు: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ నుండి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్కుమార్ ల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై కాంగ్రెస్ పార్టీ గురువారం నాడు హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.మరో వైపు కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ విషయమై ఎన్నికల సంఘానికి కూడ ఫిర్యాదు చేశారు.
కోమటిరెడ్డి రౌడీయిజానికి పుల్స్టాప్, ఉప ఎన్నికల్లో 40 వేల మెజారిటీ: జగదీష్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీలో సభ్యులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్కుమార్ల శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తూ స్పీకర్ రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకొన్నాడు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ గురువారం నాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.
మరో వైపు గాంధీభవన్లో దీక్షకు కూడ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు దిగారు . అంతేకాదు రాజకీయంగా ఈ విషయమై పోరాటం చేయాలని కూడ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.
ఎమ్మెల్యే సభ్యత్వం రద్దుపై కోర్టుకు కాంగ్రెస్
రెండు రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా హెడ్ఫోన్ విసిరిన ఘటనలో శాసనమండలి చైర్మెన్ స్వామిగౌడ్ కంటికి గాయాలయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,సంపత్కుమార్ల శాసనసభ్యత్వాలను రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకొన్నారు.స్పీకర్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించాడని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ గురువారం నాడు హైకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టులో మార్చి16న విచారణ
హైకోర్టులో మార్చి 16న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దుపై విచారణ జరగనుంది. అయితే అసెంబ్లీలో స్పీకర్కు విచక్షణాధికారం ఉంటుంది.ఈ అధికారం మేరకే నిర్ణయాలు తీసుకొనే హక్కు ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనసభ గవర్నర్ పరిధిలోకి వస్తోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో హైకోర్టులో విచారణ సందర్భంగా కోర్టు ఏం చెబుతోందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు
తెలంగాణ అసెంబ్లీలో రెండు స్థానాలు ఖాళీ అయినట్టుగా ఎన్నికల సంఘానికి తెలంగాణ స్పీకర్ కార్యాలయం నుండి సమాచారం ఇప్పటికే పంపారు. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్నారని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం గురువారం నాడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
ఎన్నికలు వస్తాయా
నల్గొండ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీ కార్యాలయం ఎన్నికల సంఘానికి సమాచారం పంపింది. అయితే ఎంపీ, లేదా ఎమ్మెల్యే స్థానం ఆరు మాసాలకు మించి ఖాళీగా ఉండకూడదు. మరో ఆరు మాసాల్లో కర్ణాటక రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి.ఆ ఎన్నికలతో పాటు ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని టిఆర్ఎస్ అంచనావేస్తోంది. ఎన్నికలు వచ్చే అవకాశం లేదని కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే హైకోర్టును ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశ్రయించారు. మరో వైపు ఎన్నికల సంఘానికి కూడ ఫిర్యాదు చేశారు. ఆయా వేదికల వద్ద తమ వాదనను బలంగా విన్పించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.