సిద్దూకు షాకిచ్చిన టీ కాంగ్రెస్: వాస్తవాలు చూపుతాం, ఇసుక పాలసీపై వ్యాఖ్యలకు ఖండన
హైదరాబాద్: తెలంగాణలో ఇసుక విధానాన్ని ప్రశంసిస్తూ పంజాబ్ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన ఒక వైపు వాదనను విని ప్రభుత్వ వాదనను సిద్దూ ప్రశంసించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్కుమార్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ రెండు రోజుల పాటు పర్యటించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఇసుక విధానాన్ని ఆయన పరిశీలించారు. కాళేశ్వరంలోని ఇసుక రీచ్లను ప్రత్యక్షంగా ఆయన సందర్శించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇసుక విధానాన్ని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు.దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సిద్దూ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
శుక్రవారం నాడు టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్కుమార్ మీడియాతో మాట్లాడారు. సిద్దూ మరోసారి ఇక్కడికి వస్తే ఇసుక విధానంలో వాస్తవాలను తాము చూపుతామని ఆయన చెప్పారు. ప్రభుత్వ పర్యటనలో భాగంగా సిద్దూ తెలంగాణకు వచ్చారని ఆయన చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అవగాహన లేకుండా సిద్దూ మాట్లాడారని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో ఇసుక మాఫియా నడుస్తోందని దాసోజు శ్రవణ్ పునరుద్ఘాటించారు. పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఇసుక దందా జరుగుతోందన్నారు. కొండూరులో ఎలాంటి లైసెన్స్ లేకుండానే దొంగచాటుగా ఇసుకను అమ్ముతున్నారని ఆయన చెప్పారు.
ఇసుక మాఫియాలో అధికార పార్టీకి చెందిన నేతలు, కొన్ని చోట్ల మంత్రులు కూడ భాగస్వామ్యులుగా ఉన్నారని ఆయన ఆరోపణలు చేశారు. ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోవడాన్ని అడ్డుకోవాలని ఆయన తెలంగాణ రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి కెటిఆర్ను కోరారు.