ఎమ్మెల్యేల సభ్యత్వం: స్పీకర్ను కలిసిన కాంగ్రెస్ నేతలు, రేవంత్ వాగ్వాదం
హైదరాబాద్: ఇటీవల సస్పెన్షన్కు గురైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటూ స్పీకర్ మధుసూదనాచారిని తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం కలిశారు. కోర్టు తీర్పును గౌరవించి వారి సభ్యత్వాలను పునరుద్ధరించాలని స్పీకర్ను కోరారు.
కాగా, ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, స్పీకర్ మధుసూదనాచారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. న్యాయస్థానం తీర్పును ఎందుకు అమలు చేయడం లేదంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు.
'పెన్ను దొంగలిస్తేనే ఉరిశిక్ష వేసినట్లు'గా మీ వైఖరి ఉందంటూ స్పీకర్ ను గట్టిగా నిలదీశారు. దీంతో నొచ్చుకున్న స్పీకర్.. మీరు ఇలాగే మాట్లాడితే వెళ్లిపోతానని అన్నారు. దీంతో సీఎల్పీ నేత జానారెడ్డి.. రేవంత్ రెడ్డిని వారించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను సముదాయించారు.
అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యే సభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చి 50రోజులు అయినప్పటికీ దానిపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
కోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేస్తుందని భావించినప్పటికీ నిరాశే ఎదురైందన్నారు. ఈ అంశంలో హైకోర్టు రెండుసార్లు మొట్టికాయలు వేసినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో చలనం లేదని జానారెడ్డి మండిపడ్డారు.