స్పీకర్, సీఎస్లపై చర్యలకు కాంగ్రెస్ డిమాండ్, రాజ్ భవన్ బయటే సంపత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నుండి సస్పెన్షన్కు గురైన నల్గొండ, ఆలంపూర్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్కుమార్ల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ స్పీకర్ తీసుకొన్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. దీంతో వీరిద్దరూ వెంటనే ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని హైకోర్టు తీర్పు చెప్పింది.అయితే కోర్టు తీర్పును అమలులో జాప్యం జరుగుతున్న విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం నాడు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సభ్యత్వం కొనసాగింపు విషయంలో హైకోర్టు తీర్పు అమల్లో చోటు చేసుకొన్న పరిణామాలను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్ నరసింహన్కు వివరించారు.
ఈ విషయమై చోటు చేసుకొన్న పరిణామాలను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్కు వివరించారు. అయితే గవర్నర్తో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల సమావేశాన్ని ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్ బహిష్కరించారు.
మూడు రోజుల క్రితం సిఎల్పీ నేత జానారెడ్డి ఇంట్లో జరిగిన సమావేశంలో కూడ ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్దరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమల్లో పార్టీ నాయకత్వం వ్యవహరించిన తీరుపై సంపత్కుమార్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సోమవారం నాడు గవర్నర్తో జరిగిన సమావేశానికి సంపత్కుమార్ హజరు కాలేదు. రాజ్భవన్ బయటనే సంపత్కుమార్ ఉండి తన నిరసనను వ్యక్తం చేశారు. రాజ్భవన్ లోపలికి ఆయన వెళ్ళలేదు.
ఇదిలా ఉంటే ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్కు వివరించారు. రాష్ట్రంలోని ఏ ఏ జిల్లాల్లో ఏ మేరకు పంట నష్టం వాటిల్లిందనే విషయమై వారు వినతిపత్రం సమర్పించారు.
స్పీకర్, సీఎస్పై చర్యలు తీసుకోవాలి
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్కుమార్ల సభ్యత్వాలను పునరుద్దరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయనందుకు స్పీకర్, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.వీరిద్దరి శాసనసభ సభ్యత్వాలను పునరుద్దరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చి 20 రోజులు దాటుతున్నా దాన్ని అమలు చేయకపోవడం దారుణమన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును చదివి విన్పించారు. ప్రత్యేక అధికారాల ద్వారానే స్పీకర్,. సీఎస్లపై చర్యలు తీసుకోవాలని గవర్న్ను కోరినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించి హైకోర్టుకు వీడియో ఫుటేజి ఇస్తానని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు సమర్పించలేదన్నారు. ఎందుకు ఈ వీడియో పుటేజీని బయటపెట్టలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.. ప్రధాన ప్రతిపక్షాలు లేకుండా బడ్జెట్ సమావేశాలు జరిగిన చరిత్ర ఎప్పుడూ లేదని తెలిపారు.