బస్సు యాత్రకు రాహుల్, ఆ ఇద్దరికీ కాంగ్రెస్ చీఫ్ ప్రశంసలు: ఉత్తమ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బస్సు యాత్రలో కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొంటారని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్కు ఉత్తమ్ వివరించారు.
పీసీపీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డితో పాటు నల్గొండ , ఆలంపూర్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్కుమార్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నేతలు శుక్రవారం నాడు న్యూఢిల్లీలో రాహుల్గాంధీతో సమావేశమయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్కుమార్ల ఎమ్మెల్యే సభ్యత్వాలను స్పీకర్ రద్దు చేస్తూ తీసుకొన్న నిర్ణయం , ఆ తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి ఉత్తమ్కుమార్ రెడ్డి వివరించారు.హైకోర్టులో స్పీకర్కు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు విషయం విన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అభినందించినట్టు ఉత్తమ్కుమార్ రెడ్డి చెప్పారు.
అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహారిస్తే చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదని ఉత్తమ్కుమార్ రెడ్డి అధికార పార్టీ నేతలను హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నిర్వహిస్తున్న బస్సు యాత్రకు సంబంధించి రాహుల్గాంధీకి వివరించినట్టు ఆయన చెప్పారు.
ప్రజల నుండి ఈ యాత్రకు మంచి స్పందన లభిస్తోందన్నారు. అయితే బస్సు యాత్రలో పాల్గొనాల్సిందిగా తమ ఆహ్వానానికి రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. త్వరలోనే బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొంటారని ఆయన చెప్పారు.
రాహుల్ గాంధీతో భేటీ అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ను ఓడించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆయన కోరారు. . హైకోర్టు చరిత్రాత్మక తీర్పును ప్రభుత్వం గౌరవించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.
రాహుల్తో సుదీర్ఘభేటీ తమలో ఉత్సాహాన్ని పెంచిందని ఎమ్మెల్యే సంపత్ అన్నారు. తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలను రాహుల్ తెలుసుకున్నారని చెప్పారు. హైకోర్టు తీర్పు స్ఫూర్తిగా అన్ని విషయాలపై పోరాడాలని రాహుల్ సూచించారని, కేసీఆర్ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని సంపత్ స్పష్టం చేశారు.