తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రాజెక్టుల బాట.! 13న గోదావరి జల దీక్ష.!!
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వేగం పెంచారు. ప్రభుత్వ విధానాల మీద క్షేత్ర స్థాయిలో పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణం అంశంలో తెలంగాణ ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం మభ్యపెడుతూ భ్రమలు కల్పిస్తోంది తప్ప క్షేత్ర స్థాయిలో ఒక్క పని జరగడం లేదని విమర్శిస్తున్నారు. అవే అంశాలను తెలంగాణ ప్రజలకు వివరిస్తామంటున్నారు టీపీసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గోదావరీ నది పై అప్పటి కాంగ్రెస్ పార్టీ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను ఏమేరకు తెలంగాణ ప్రబుత్వం నిర్లక్ష్యం చేస్తుందో ప్రపంచానికి చాటి చెప్పడమే ప్రాజెక్టుల బాట లక్ష్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ గోదారి బాట.. ప్రాజెక్టుల్లో జరుగుతున్న నిర్లక్ష్యం ప్రజలకు చూపించడమే లక్ష్యం..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల బాట పట్టబోతోంది. ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరుగుతున్న నిర్లక్ష్యం, పక్క రాష్ఠ్రాలతో సాగిస్తున్న ఉదాసీన వైఖరిని ప్రజలకు చెప్పడమే లక్ష్యంగా ప్రాజెక్టుల బాటకు శ్రీకారం చుడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. గోదావరి నది పైన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ఈ నెల 13వ తేదీన సందర్శించి వాటి పురోగతిని సమీక్షించి ప్రజలకు వివరించనున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.
సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారు.. ప్రజలకు వాస్తవాలు చెప్తామంటున్న టీపీసిసి..
తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ప్రభుత్వ హయాంలో గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన ఆ ప్రాజెక్టుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియ జేస్తామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయమై ఆయన మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నాయకులతో, ఎంపీ, ఎమ్యెల్యే లతో ఫోన్ ద్వారా చర్చించారు. 13వ తేదీన గోదావరి నది పైన ఉన్న ప్రాజెక్టులను సందర్శించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని సూచించారు.
రాష్ట్ర కాంగ్రెస్ నేతలను భాగస్వామ్యం చేస్తున్న ఉత్తమ్.. కలిసికట్టుగా ఉద్యమానికి శ్రీకారం..
ఈ సందర్బంగా ప్రాణహిత ప్రాజెక్టు స్థలం ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద ఎమ్యెల్సి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి శశిధర్ రెడ్డి, ఎల్లంపల్లి వద్ద ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి వంశీ చందర్ రెడ్డి, గౌరవల్లి జలాశయం వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బృందం పరిశీలించనుంది.
ప్రజలను తెలంగాణ ప్రభుత్వం మభ్యపెడుతోంది.. నిజ నిర్ధారణ కోసమే ప్రాజెక్టుల బాట అంటున్న ఉత్తమ్..
ఇక దేవాదుల ప్రాజెక్టు వద్ద ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్యెల్యే సీతక్క, దుమ్ముగూడెం ప్రాజెక్టు వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్యెల్యే పొడెం వీరయ్య, మాజీ ఎంపీ వి .హనుమంతరావు, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాములు నాయక్, అలిసాగర్ ప్రాజెక్టు వద్ద మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కామారెడ్డి సమీపంలో ప్రాణహిత 22వ ప్యాకేజీ భూంపల్లి వద్ద మాజీ మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ పాల్గొంటారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఇక ఇదే అంశం పట్ల అదికార గులాబీ పార్టీ ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి.