ద్రౌపది వస్త్రాపహరణతో అసెంబ్లీ ఎన్నికలకు పోలిక..! హైదరాబాద్లో కాంగ్రెస్ వివాదాస్పద నిరసన?
హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, సమయం దొరికినప్పుడల్లా అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడమే గాకుండా మాటల తూటాలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ లీడర్లు హైదరాబాద్ లో చేపట్టిన ఆందోళన పర్వం చర్చానీయాంశంగా మారింది.
ఆనాడు మహాభారతం.. ఈనాడు ప్రజాస్వామ్యం
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ.. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ దగ్గర ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికలను అపహాస్యం చేశారంటూ మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహారణతో పోల్చుతూ ఫ్లెక్సీ కట్టారు. "మహాభారతంలో ద్రౌపది.. తెలంగాణలో ప్రజాస్వామ్యం" అనే టైటిల్ పెట్టారు. ఓట్లను ద్రౌపదితో పోల్చుతూ.. ERO, DRO, CEO లను దుశ్శాసనుడి కింద లెక్కగట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ధృతరాష్ట్రుడిగా చిత్రీకరించారు. సీఎం కేసీఆర్ తో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ల కార్టూన్ ఫోటోలను కూడా చేర్చారు. అందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లుగా ఫ్లెక్సీని రూపొందించారు.
సెంట్రల్ ఈసీపై గుస్సా..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ప్రయత్నించిన కాంగ్రెస్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 119 స్థానాలకు గాను 19 చోట్ల మాత్రమే గెలుపొందిన కాంగ్రెస్.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తోంది. దీనిపై పలుమార్లు ఈసీ అధికారులకు ఫిర్యాదు చేసినా.. వారి నుంచి స్పందన లేదు. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని కోరినా.. ఇప్పటివరకు దాని ఊసే లేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుపడుతూ ఆందోళనకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ లీడర్లు. ఎన్నికలు పూర్తయ్యాక నిర్ణీత గడువు తర్వాత వీవీ ప్యాట్ స్లిప్పులు తొలగిస్తారనే నేపథ్యంలో అలర్టయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుపడుతూ వింత నిరసనకు దిగారు. మరోవైపు న్యాయపోరాటానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో బీజేపీ నేతలపై కూడా..!
పంచమవేదమైన మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహారణ ఘట్టాన్ని ఇలా నిరసనలకు వాడుకోవడం ఇది కొత్తేమీ కాదు. గతంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రసంగానికి అడ్డుపడుతూ కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి బిగ్గరగా నవ్వారు. దీంతో ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ నేపథ్యంలో మహిళను ప్రధాని అవమానపరిచారంటూ కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. రేణుకాచౌదరిని ద్రౌపదిగా, రాహుల్ గాంధీని కృష్ణుడిగా మోదీ, అమిత్ షా, కిరణ్ రిజుజును కౌరవులుగా చిత్రీకరించిన ఆ ఫోటో అప్పట్లో సంచలనంగా మారింది. వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. అయితే తాజాగా హైదరాబాద్ లో ద్రౌపది వస్త్రాపహారణ ఘట్టంతో కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమం వివాదస్పదంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఆందోళన పర్వం కాంగ్రెస్ శ్రేణులకు కలిసొస్తుందా.. లేదంటే రివర్స్ అవుతుందా అనేది చూడాలి.