బీజేపీ నేతల వద్ద బ్లాక్ మనీ: గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్లి వైపు వేళ్లు
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ నాయకుల వద్ద నల్లధనం ఉందని, అలా ఉందని చెప్పడానికి కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్లే నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు బుధవారం నాడు అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీకి ఇవన్నీ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పెళ్లిళ్లు సైతం ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల వద్ద వరుసలో నిలుచున్న వారిలో ఒక్కరైనా కోటీశ్వరులు ఉన్నారా అని ప్రశ్నించారు. అలా నిరూపిస్తే తాను సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు.
గాలి కూతురు సంగీత్ అదుర్స్: ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ, వెళ్తానన్న యెడ్డీ
కాగా, గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. బెంగళూరులోని ప్యాలెస్లో పెళ్లి జరుగుతోంది. విజయనగర సెట్టింగులు వేశారు. బాలీవుడ్ నుంచి ఆర్ట్ డైరెక్టర్ల నుంచి ఎంతోమంది సెట్ వేశారు. 3వేల మంది బౌన్సర్లను ఏర్పాటు చేశారు. ఈ పెళ్లికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
బీజేపీ నేతలకే నష్టం: జోగు రామన్న
నల్లధన నిర్మూలనకు పెద్ద నోట్లు రద్దుతో బీజేపీ నేతలకే ఎక్కువ నష్టం వాటిల్లితుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి జోగు రామన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు పైన తెరాస ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని విలేకరులు ప్రశ్నించారు.
దీనిపై ఆయన మాట్లాడారు. ఆర్థిక నిపుణులతో ముఖ్యమంత్రి చర్చించిన తర్వాత సమావేశం నిర్వహించి 15 రోజుల్లో స్పష్టత ఇస్తామన్నారు. దేశంలోని ముఖ్యమంత్రులంతా ఈ విషయమై త్వరలో భేటీ కానున్నారని చెప్పారు.