వీడియో: రేవంత్ రెడ్డి.. రాత్రికి రాత్రి పాదయాత్రకు శ్రీకారం: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యం
నాగర్ కర్నూల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టదలిచిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రాజీవ్ రైతు భరోసా ఆందోళన కార్యక్రమాన్ని పాదయాత్రగా మార్చేశారు. రాత్రికి రాత్రి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పటికప్పుడు ఆయన తీసుకున్న పాదయాత్ర నిర్ణయం.. తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఏడేళ్లుగా.. వరుస ఓటములను ఎదుర్కొంటూ వస్తోన్న కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపజేసేదిగా అంచనా వేస్తున్నారు.
Recommended Video
పాదయాత్ర.. ఎక్కడి నుంచి ఎక్కడికి?
నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట్ నుంచి హైదరాబాద్ వరకు సుమారు 150 కిలోమీటర్ల పాటు ఈ పాదయాత్ర సాగనుంది. ఆదివారం రాత్రి అచ్చంపేట్లో ఆయన పాదయాత్రను ప్రారంభించారు. హైదరాబాద్కు పాదయాత్రగా బయలుదేరారు. తొలిరోజు 11 కిలోమీటర్ల దూరం నడిచారు. అచ్చంపేట్ నుంచి ఉప్పునూతల వరకు నడిచారు. రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్కు పాదయాత్ర పునఃప్రారంభిస్తారు. అచ్చంపేట్-హైదరాబాాద్ మధ్య ఉండే గ్రామాల మీదుగా ఆయన పాదయాత్ర సాగుతుంది. స్థానికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ నేత మల్లు రవి ఆయన వెంట ఉన్నారు.
రాజీవ్ రైతు భరోసా ఆందోళనలో పాదయాత్ర నిర్ణయం..
మూడు వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ దేశ రాజధానిలో రోజుల తరబడి దీక్షలు చేస్తోన్న రైతాంగానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ.. జాతీయస్థాయిలో రాజీవ్ రైతు భరోసా ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీపీసీసీ నాయకులు రైతు భరోసా దీక్షలను ప్రారంభించారు. ఒక్కోరోజు ఒక్కో ప్రాంతంలో ఈ ఆందోళలను నిర్వహిస్తున్నారు. ఆదివారం అచ్చంపేట్లో నిర్వహించిన ఆందోళనలో రేవంత్ రెడ్డి, సీతక్క, మల్లు రవి పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క, మల్లు రవి చేసిన సూచనలకు అనుగుణంగా అప్పటికప్పుడు రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు.
కేంద్రం మొండి వైఖరి..
అంతకుముందు-రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు భరోసా ఆందోళనలో పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని మండిపడ్దారు. రోజుల తరబడి రైతులు ఆందోళనలు చేపడుతున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో చలనం రావట్లేదని విమర్శించారు. దేశానికి అన్నంపెట్టే రైతులను కేంద్ర ప్రభుత్వం నరకం చూపిస్తోందని ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగం మొత్తాన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికే మూడు వ్యవసాయ బిల్లులను అమలు చేయాలని చూస్తోందని, దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతుపైనా ఉందని అన్నారు.