కలిసిరాని అసెంబ్లీ.. ఊపు తెప్పించిన లోక్సభ.. ఇక మున్సిపల్ పోరులో నిలిచి గెలిచేనా?
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు కలిసిరాలేదు. చేదు అనుభవం మిగిలింది. ఆ తర్వాత జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాసింత ఉపశమనం లభించింది. ఇక లోక్సభ ఎన్నికల ఫలితాలు కొంత ఊపునిచ్చాయి. ఇదంతా కూడా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ దూకుడుకు కాంగ్రెస్ పార్టీ కుదేలవుతున్న వైనం. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. 119 స్థానాలకు గాను కేవలం 19 స్థానాల్లో మాత్రమే గెలిచి డీలా పడింది.
అసెంబ్లీ యవ్వారం తేడా కొట్టినా.. లోక్సభ ఎన్నికల వేళ కారు జోరుకు బ్రేకులు వేసి మూడు స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలవడం కాంగ్రెస్ పెద్దలకు ఊరటనిచ్చింది. అదే ఊపుతో మున్సిపల్ పోరుకు సన్నద్ధమవుతున్నారు హస్తం గూటి నేతలు.
నో కన్ఫ్యూజన్, ఫుల్ క్లారిటీ.. రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.. ఉత్తముడే రథసారధి..!
Recommended Video
టీఆర్ఎస్ హవాతో కాంగ్రెస్ పార్టీకి బ్రేకులు
ఉద్యమ పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి జనాలకు బాగా దగ్గరైంది. 2014లో తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ క్రమక్రమంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ కోతలతో తీరని వెతలు అనుభవించిన రాష్ట్ర ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చీకట్లు లేని రాత్రులను పరిచయం చేసింది. 24 గంటల కరెంట్ అందించి ప్రజల హృదయాలను గెలుచుకుంది.
ఆ క్రమంలో గతేడాది డిసెంబరులో ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండోసారి విజయకేతనం ఎగురవేసింది టీఆర్ఎస్. తొలి ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేసిన పనులు ఆ పార్టీకి పట్టం కట్టాయి. జనాలు గంపగుత్తగా కారు గుర్తుకు ఓటేసి మరోసారి విజయం కట్టబెట్టారు. అయితే కారు జోరుకు కాంగ్రెస్ మంత్రం పారలేదు. టీడీపీతో పాటు ఇతర పార్టీలతో మహాకూటమిగా ఏర్పడ్డప్పటికీ కాంగ్రెస్ బొక్కాబొర్లా పడ్డ పరిస్థితి కనిపించింది.
కొంచెం దృష్టి పెట్టి టీఆర్ఎస్ను ఢీ కొట్టే ఆలోచన
ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘోర పరాభవం ఎదురైనప్పటికీ.. ఆ తర్వాత జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టం కట్టారు విద్యావంతులు. దాంతో టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తూ యువకులు, ఉద్యోగులు తమకు అండగా నిలబడ్డారనేది కాంగ్రెస్ వెర్షన్. అదే క్రమంలో లోక్సభ ఎన్నికల్లోనూ కారు జోరుకు కాంగ్రెస్ పార్టీ బ్రేకులు వేయగలిగింది. సారు.. కారు.. పదహారు అంటూ అన్నీ స్థానాల్లో గెలుస్తామని టీఆర్ఎస్ నేతలు కలలు కన్నప్పటికీ అది సాధ్యపడలేదు.
టీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గట్టి పోటీనిచ్చాయి. మూడు స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలవడంతో కాంగ్రెస్ అధిష్టానం మస్తు ఖుషీ అయింది. టీఆర్ఎస్ హవాను తట్టుకుని మూడు స్థానాలు గెలవడం అంతా ఆషామాషీ వ్యవహారం కాదంటున్నారు. ఆ నేపథ్యంలో కొద్దిగా దృష్టి పెడితే రానున్న కాలంలో టీఆర్ఎస్ను ఢీకొట్టడం పెద్ద కష్టమైన పని కాదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
మున్సిపల్ పోరుకు సై.. ఇప్పటినుంచే కసరత్తు
అసెంబ్లీ ఎన్నికల వేళ ఘోరంగా దెబ్బతిన్నప్పటికీ.. లోక్సభ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో ధైర్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దాంతో రానున్న మున్సిపల్ ఎన్నికలపై సీరియస్గా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో మున్సిపల్ పోరుకు సన్నద్ధమయ్యేలా పక్కా ప్లాన్ వేస్తోంది. ఆదివారం నాడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా నేతృత్వంలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని డిసైడయ్యారు. మొత్తం 140 మున్సిపాలిటీలకు ఇన్ఛార్జిలను నియమించడంతో పాటు ఖాళీగా ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జిలను నియమించేందుకు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశారు. టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఏఐసీసీ కార్యదర్శులు సంపత్కుమార్, వంశీచందర్ రెడ్డితో కమిటీ వేసి వారం రోజుల్లో నియామకాలు పూర్తి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.