టీ కాంగ్రెస్ కురువృద్ధుడికి కరోనా పాజిటివ్: జన్మదినం నాడు దుప్పట్ల పంపిణీ ఎఫెక్ట్?
హైదరాబాద్: జంటనగరాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దాని తీవ్రత మరింత దారుణంగా మారింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుళ్లు, జర్నలిస్టులకు సోకిన కరోనా వైరస్.. రాజకీయ నాయకులను వదిలి పెట్టట్లేదు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారిన పడ్డారు. హోమ్ క్వారంటైన్లకు వెళ్లిపోయారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్థన్ దంపతులు కరోనా పాజిటివ్గా తేలారు.
Recommended Video
తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావుకు కరోనా వైరస్ సోకింది. అస్వస్థతకు గురైన ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలను చేయించుకోగా.. కరోనా వైరస్ పాజిటివ్గా తేలినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీనితో ఆయన అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆయనతో గల కాంటాక్టులను గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటిదాకా ఆయనను ఎవరెవరు కలిశారనే విషయంపై కుటుంబ సభ్యులు పార్టీ నాయకుల వద్ద ఆరా తీస్తున్నారు.
గుడ్ న్యూస్: కరోనాకు గ్లెన్మార్క్ మాత్ర, డీసీజీఐ ఆమోదం, ఒక్కో మాత్ర రూ.103..
వీహెచ్ కుటుంబ సభ్యులకు కూడా కరోనా వైద్య పరీక్షలను నిర్వహించారు. వాటికి సంబంధించిన రిపోర్టులు ఇంకా అందాల్సి ఉంది. ముందుజాగ్రత్త చర్యగా వీహెచ్ కుటుంబ సభ్యులు హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ఈ నెల 16వ తేదీన వీహెచ్ జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన కొన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. సుమారు వందమంది పేదలకు దుప్పట్లును పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన కరోనా వైరస్ సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అప్పటి నుంచే ఆయన అనారోగ్యానికి గురయ్యారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మరుసటి రోజు నుంచీ వీహెచ్కు స్వల్పంగా జ్వరం పట్టిందని, వాతావరణ మార్పు వల్ల వచ్చి ఉండొచ్చని తొలుత అనుమానించారు. ఎంతకీ జ్వరం తగ్గకపోవడం, దగ్గు రావడం వంటి కరోనా వైరస్ లక్షణాలు తలెత్తాయి. దీనితో ఆయనకు అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలను నిర్వహించారు. అవి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి.