ఉమ్మడిగా ఉన్నప్పుడే ఇచ్చారు: కెసిఆర్పై జానా
హైదరాబాద్/ మహబూబ్నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జిల్లాలు పర్యటించేందుకే పదవిలోకి వచ్చినట్లున్నారని ప్రతిపక్ష నేత, కాగ్రెసు సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లాల పర్యటననే కెసిఆర్ పనిగా భావిస్తున్నారని ఆయన ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
హామీ ఇవ్వాలనుకుంటే హైదరాబాద్ నుంచి కూడా ఇవ్వవచ్చునని, అయినా కెసిఆర్ జిల్లాలు పర్యటిస్తున్నారని ఆయన అన్నారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు రబీ పంటకు నీళ్లిచ్చే అంశంపై ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన లేదని, రబీకి నీళ్లిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. కానీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు
రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా రెండో పంటకు నీరందించారని, ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆయన అన్నారు. కృష్ణపట్నం విద్యుత్తు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత కెసిఆర్పై ఉందని జానా రెడ్డి అన్నారు.
కాగా, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అందించిన పాలమూరు జిల్లాను ముఖ్యమంత్రి కెసిఆర్ విస్మరించారని బిజెపి సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు జిల్లాలో సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన శనివారం నాగర్ కర్నూలు మండలం గుడిపల్లి వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు మాట్లాడడం మానుకోవాలని ఆయన మంత్రులకు సూచించారు.