లాక్డౌన్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్పై మహిళ వీరంగం: చొక్కా పట్టుకుని, లాఠీ లాక్కుని
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ.. అటు డాక్టర్లు, వైద్య సిబ్బందే కాదు.. చివరికి విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనా దాడులు కొనసాగుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లపై కరోనా వైరస్ వల్ల మరణించిన పేషెంట్ కుటుంబ సభ్యులు దాడి చేసిన ఉదంతాాన్ని విస్మరించకముందే- పోలీస్ కానిస్టేబుల్పై ఓ మహిళ దౌర్జన్యానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది.
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అతని తల్లి పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. విధి నిర్వహణలో ఉన్న మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గోపాల్ కాలర్ పట్టుకుని మరీ వీరంగం సృష్టించారు. నలుగురు కానిస్టేబుళ్లు ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ.. వినిపించుకోలేదు. ఆ మహిళ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్కు తరలించారు. సికింద్రాబాద్ మౌలాలి ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది.
Video: లాక్డౌన్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్పై మహిళ వీరంగం pic.twitter.com/tUXeRNpEi0
— oneindiatelugu (@oneindiatelugu) April 5, 2020
మౌలాలీ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు బైక్పై తన తల్లిని ఎక్కించుకుని వెళ్తుండగా.. ప్రశాంతినగర్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. లాక్డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బయట ఎవ్వరూ తిరగకూడదని, వెనక్కి వెళ్లాలని ఆదేశించారు. లాక్డౌన్ అమల్లో ఉన్నందున బైక్ ఒక్కరి మించి ఎక్కువ తిరగకూడదని సూచించారు. పోలీసుల మాటలను పట్టించుకోలేదతను. ముందుకు వెళ్లడానికి ప్రయత్నించగా.. బైక్ కీని లాక్కున్నారు. దీనితో ఆ యువకుడు, అతని తల్లి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.
దీనితో వారు ఆ యువకుడి కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని తల్లి పోలీసులతో గొడవకు దిగారు. తన కుమారుడిని వదిలి వేయాలని పట్టుబట్టారు. ఓ కానిస్టేబుల్ కాలర్ను పట్టుకున్నారు. ఆమెను వారించడానికి నలుగురు పోలీసులు ప్రయత్నించినప్పటికీ.. ఆమె వినిపించుకోలేదు. అక్కడే విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆమెపై లాఠీఛార్జీ చేసినప్పటికీ.. వినిపించుకోలేదు. పోలీసులు ఆ యువకుడిని తమ వాహనంలో ఎక్కించడానికి ప్రయత్నించగా.. తీవ్రంగా ప్రతిఘటించారు. చివరికి- ఆ యువకుడిని తమ వాహనంలోకి ఎక్కించుకుని పోలీస్స్టేషన్కు తరలించారు.