ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కేసు.. దు:ఖంలో ఉన్న ఆ తండ్రిపై పోలీస్ అమానుషం..
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెల నారాయణ క్యాంపస్లో ఇంటర్ విద్యార్థిని సంధ్యారాణి సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హాస్టల్ వాష్రూమ్లో ఆమె ఆత్మహత్య చేసుకుందని కాలేజీ యాజమాన్యం చెబుతోంది. అయితే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని బాలిక తల్లిదండ్రులు అంటున్నారు. బుధవారం బాలిక మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టమ్ కోసం తరలిస్తుండగా.. ఆమె తండ్రి శవపేటికకు అడ్డుపడ్డాడు. దీంతో ఓ పోలీస్ అధికారి నిర్దాక్షిణ్యంగా అతన్ని బూటు కాలితో తన్నాడు. దానికి సంబంధించిన వీడియో మనసుల్ని కలచివేసేలా ఉంది.
బూటు కాలితో తన్ని ఈడ్చిపారేసిన పోలీ
బుధవారం కొంతమంది పోలీసులు క్యాంపస్ హాస్టల్ నుంచి బాలిక(16) మృతదేహాన్ని శవపేటికలో పోస్టుమార్టమ్కు తరలించారు. ఆ సమయంలో మృతురాలి తండ్రి శవపేటికను అడ్డుకున్నాడు. అక్కడినుంచి కదలనివ్వకుండా.. కింద పడుకుని శవపేటికను గట్టిగా పట్టుకున్నాడు.దీంతో అతన్ని బూటు కాలితో తన్నిన ఓ పోలీస్ అధికారి.. అక్కడినుంచి పక్కకు ఈడ్చిపారేశాడు. అక్కడే ఉన్న అతని భార్య అడ్డుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.
కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన ఎస్పీ
కూతురు చనిపోయిన దు:ఖంలో ఉన్న ఆ తండ్రిపై సదరు పోలీస్ కానిస్టేబుల్ చేసిన దాడి చాలామందిని కలచివేసింది. సదరు అధికారిపై తీవ్ర విమర్శలు రావడంతో మెదక్ ఎస్పీ చందనా దీప్తి అతన్ని సస్పెండ్ చేశారు. ఘటనపై అంతర్గత విచారణకు కూడా ఆదేశించిన ఎస్పీ.. ఆ పోలీస్ కానిస్టేబుల్కి కౌన్సెలింగ్ కూడా ఇప్పిస్తామని చెప్పారు.ఘటనపై చందనా దీప్తి మాట్లాడుతూ.. పోలీసులు శవపేటికలో బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టమ్కి తరలిస్తున్న సమయంలో.. మృతురాలి కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారని చెప్పారు. బాలిక మృతదేహాన్ని వారు అక్కడినుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని అన్నారు.
ఆత్మహత్య కాదంటున్న తల్లిదండ్రులు
బాలిక ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు ఇంతవరకు స్పష్టం కాలేదు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.తీవ్రమైన జ్వరం,డిప్రెషన్తో బాధపడుతున్నందువల్లే తమ కుమార్తె చనిపోయిందని.. ఆమె ఆత్మహత్య చేసుకోలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తున్నారు. ఆమె చనిపోయిన తర్వాత చాలాసేపటి వరకు తమ సమాచారం ఇవ్వలేదన్నారు.
Recommended Video
మంగళవారం మధ్యాహ్నం ఫోన్ చేసి..
మంగళవారం మధ్యాహ్నం ఫోన్ చేసి సంధ్య ఆరోగ్యం బాగాలేదని, అర్జెంటుగా రావాలంటూ ఫోన్ చేశారని మృతురాలి తల్లి చెప్పింది. తాము వచ్చే సరికి నల్లగండ్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని చెప్పింది. వాష్ రూమ్ లోని గీజర్ పైపుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని కాలేజీ సిబ్బంది చెబుతున్నారని.. తమ కుమార్తెకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కాలేజీ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. వాష్రూమ్లో ఉండే చిన్నసైజ్ కొక్కేనికి ఎలా ఉరేసుకుంటారని ప్రశ్నించింది. ఓ వైపు కూతురు చనిపోయిన బాధలో ఉంటే.. పోలీసులు బూటు కాళ్ళతో తన్నడం ఎంత వరకు సమంజసం అని నిలదీసింది.