ధోనీ కంటే మంచి ఆటగాళ్లకోసం.. టి క్రికెట్ అసోసియేషన్: హెచ్సిఏపై తీవ్రవ్యాఖ్య!
హైదరాబాద్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదివారం నాడు హైదరాబాదులో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామీణ యువతకు సరైన శిక్షణ ఇస్తే ధోనీ కంటే మంచి ఆటగాళ్లను తయారు చేయవచ్చన్నారు.
ఇందు కోసం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కృషి చేయాలని దత్తాత్రేయ, ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. గ్రామీణ ప్రాంత యువతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇది పని చేస్తుందని చెప్పారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సిఏ) కొందరి ప్రయోజనాలు కాపాడేందుకే పరిమితమైందన్నారు. క్రీడాకారుల నుంచి హెచ్సిఏ డబ్బులు వసూలు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. అలాంటి పద్ధతులకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ దూరంగా ఉండాలన్నారు.
క్రికెట్ డబ్బున్న వారి ఆట అనే భావనను తొలగించేందుకు కృషి చేయాలన్నారు. కాగా, నూతనంగా ఏర్పడిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు ఈటెల చైర్మన్గా నియమితులయ్యారు.
చీఫ్ ప్యాట్రన్గా బండారు దత్తాత్రేయ, ప్యాట్రన్లుగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డిలు, వైస్ చైర్మన్గా బీబీ పాటిల్, ప్రెసిడెంట్గా యెండల లక్ష్మీ నారాయణ, వైస్ ప్రెసిడెంట్గా వీరేందర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ అండ్ ట్రెజరర్గా సీఎల్ రాజ్యం, సెక్రటరీగా గురువా రెడ్డిలు ఎన్నికయ్యారు.