coronavirus:సూర్యాపేట మార్కెట్ సందర్శించిన సీఎస్, డీజీపీ, వైరస్ వ్యాప్తిపై ఆరా...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధి, నిజామాబాద్, సూర్యాపేటలో పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సూర్యాపేట కూరగాయాల మార్కెట్లో కరోనా వైరస్ సోకిన వ్యక్తి సంచరించడంతో పాజిటివ్ కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో పరిస్థితిని సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో వారు బుధవారం సూర్యాపేటలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట వరకు హెలికాప్టర్లో చేరుకున్నారు. సూర్యాపేట తర్వాత జోగుళాంబ గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పర్యటిస్తారు.
ఇటీవల మర్కజ్ వెళ్లొచ్చిన వారితో సూర్యాపేటలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అతను మార్కెట్ ఏరియాలో సంచరించడంతో వైరస్ కేసుల సంఖ్య పెరిగింది. నిన్న ఒక్కరోజే 26 పాజిటివ్ కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఇదివరకు 54 కేసులతోపాటు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80కి చేరింది. దీంతో సూర్యాపేటలో వైరస్ ప్రబలకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. కంటైన్మెంట్ జోన్లలో మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు.
కరోనా వైరస్ విసృతిస్తోన్న మార్కెట్ను సీఎస్, డీజీపీ పరిశీలించారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను అడిగారు. వైరస్ ఏ విధంగా వ్యాపించిందనే అంశంపై మ్యాప్ రూపంలో మున్సిపల్ సిబ్బంది వివరించారు. వైరస్ నిరోధం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తర్వాత కలెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి కార్యాలయంలో సీఎస్, డీజీపీ సమీక్షించారు. వీరితో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
Recommended Video