ఇలా, అలా: రోజాపై బెట్టువీడని జగన్, బాబు: డీకే అరుణపై పద్మ 'సంస్కారం'
హైదరాబాద్/విజయవాడ: ఏపీ, తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న రెండు ఘటనలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఏపీ సమావేశాలర్లో జరిగిన రోజా అంశం, తెలంగాణ సమావేశాల్లో మంగళవారం జరిగిన డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అంశం చర్చనీయాంశమయ్యాయి.
ఏపీ ప్రతిపక్ష సభ్యురాలు రోజా తాను అనని వ్యాఖ్యలు అన్నానని చెబుతున్నారని, ముఖ్యమంత్రి, మంత్రులు అంతకంటే పెద్ద మాటలు మాట్లాడారని చెబుతుండగా, తెలంగాణ ప్రతిపక్ష సభ్యురాలు డికె అరుణ కూడా తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి, మంత్రుల పట్ల రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారని, టిడిపి మహిళా ఎమ్మెల్యే అనిత పైన ఘాటు వ్యాఖ్యలు చేశారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు, మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ.. సంస్కారం లేనివాళ్లు సభను నడిపిస్తున్నారని వ్యాఖ్యానించినట్లుగా టిఆర్ఎస్ నేతలు చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు మాత్రం తాము అలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయలేదంటున్నారు.
ఘాటా వ్యాఖ్యలు చేశారా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే ఈ రెండు అంశాలను పోల్చి చూస్తున్న వారు ఉన్నారు. తద్వారా వీటిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
డీకే అరుణ తనను ఉద్దేశించి సంస్కారం లేని వారు సభను నడుపుతున్నారంటూ వ్యాఖ్యానించినట్లు స్పీకర్ స్థానంలో ఉన్న ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి ఆవేదన చెందగా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రి హరీశ్ రావు.. అరుణ క్షమాపణలు చెప్పాల్సిందేని పట్టుబట్టారు.
అమె చెప్పకపోవడంతో సస్పెండ్ చేయాల్సిందిగా ప్రతిపాదించబోయారు. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీలోని రోజా అంశాన్ని హరీష్ రావు ప్రస్తావించారు. ఈ పరిణామాల మధ్య ఉద్వేగానికి లోనైన డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. ఇది సభలో కాసేపు ఉద్విగ్నతకు దారి తీసింది.
తాను అనలేదని డీకే అరుణ గట్టిగా చెప్పారు. అయితే ఇతర సభ్యులు పట్టుబట్టడంతో హరీష్ రావు కూడా డీకే అరుణను సస్పెండ్ చేసేందుకు సిద్ధపడ్డారు. అదే సమయంలో స్పీకర్ స్థానంలో ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి కల్పించుకొని.. మంత్రిగారూ అది విజ్ఞతకు వదిలేద్దామని చెప్పి డీకే అరుణపై చర్యలు లేకుండా చేశారు.
అదే సమయంలో ఏపీలో రోజా అంశం బడ్జెట్ సమావేశాల ప్రారంభం నుంచి చర్చనీయంశమవుతోంది. తెలంగాణ అసెంబ్లీలో విజ్ఞతపై వదిలేయగా, ఏపీలో మాత్రం రోజా ఇష్యూపై అధికార పక్షం, ప్రతిపక్షం పట్టుదలగా ముందుకు వెళ్తున్నాయని అంటున్నారు.
రోజా వ్యాఖ్యలతో పోల్చుకుంటే డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు పెద్దవేం కావనే (ఒకవేళ ఇద్దరూ వ్యాఖ్యలు చేసి ఉంటే) వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వాన్ని కూడా పోల్చుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వలే ఏపీలోను రోజా వ్యాఖ్యల పైన ఆమె విజ్ఞతకు వదిలేయాల్సి ఉండేదని కొందరు చెబుతుండగా, అలాంటి ఘాటు వ్యాఖ్యల పట్ల ఊరుకుంటే మరోసారి చేసేందుకు అవకాశం ఉంటుందని, డీకే అరుణ వ్యాఖ్యలకు, రోజా వ్యాఖ్యలకు పోలిక లేదనే వారు కూడా లేకపోలేదు.
డికె అరుణ వ్యాఖ్యల పైన హరీష్ రావు పట్టుదలకు పోయినా, డిప్యూటీ స్పీకర్ పద్మా కల్పించుకొని విజ్ఞతను ప్రదర్శించారని అంటున్నారు. కానీ రోజా విషయంలో ఇటు క్షమాపణలు చెప్పకుండా ప్రతిపక్షం, అటు పైఎత్తులు వేస్తూ టిడిపి పట్టుదలకు పోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. రోజా ఇష్యూ వల్ల ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పద్మా దేవేందర్ రెడ్డి
తెలంగాణ శాసన సభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి బుధవారం నాడు తెలంగాణ శాసన సభలో కంటతడి పెట్టారు.
పద్మా దేవేందర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు డికె అరుణ చేసిన వ్యాఖ్యలకు కలత చెందిన డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కంటతడి పెట్టారు. దీంతో సభలో ఉద్వేగం కనిపించింది.
జానా రెడ్డి
పద్మా దేవేందర్ రెడ్డి పైన తమ పార్టీ సభ్యురాలు డికె అరుణ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెబుతున్నారని, ఒకవేళ చేస్తే సభ్యుల విజ్ఞతకు వదిలేయాలని చెబుతున్న జానా రెడ్డి.
డికె అరుణ
తాను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డిని, సభను ఉద్దేశించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెబుతున్న డికె అరుణ.
హరీష్ రావు
డిప్యూటీ స్పీకర్ పైన చేసిన వ్యాఖ్యలకు డికె అరుణ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆమెపై చర్యలు తీసుకుంటామని చెబుతున్న హరీష్ రావు.
రోజా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా మూడు రోజుల క్రితం ఏపీ అసెంబ్లీ ఎదుట సొమ్మసిల్లి పడిన దృశ్యం.