అన్న మీద అలిగితే ఏపీలో పార్టీ పెట్టాలె చెల్లెమ్మా: షర్మిలపై పేలుతోన్న సెటైర్లు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిలా.. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతోన్నారంటూ వస్తోన్న వార్తలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. దీనికి అనుగుణంగా- ఆమె హైదరాబాద్లోని లోటస్పాండ్ నివాసంలో వైఎస్సార్సీపీ నాయకులు, సానుభూతిపరులతో సమావేశం కావడం.. రాజకీయ దుమారానికి దారి తీస్తోంది. వైఎస్ షర్మిలా రాజకీయ పార్టీ ప్రతిపాదనలు, సానుభూతిపరులతో సమావేశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
వైఎస్ షర్మిలా రాజకీయ పార్టీ పెడతారో.. లేదో ఖచ్చితంగా తెలియరావట్లేదు గానీ.. ఆ దిశగా ఆమె అడుగులు వేస్తున్నారనేది స్పష్టమౌతోంది. పార్టీ విధి, విధానాలు ఎలా ఉండాలనేది ఖరారు కాలేదు. క్షేత్రస్థాయిలో పార్టీని ఎలా తీసుకెళ్లాలనేది తేలాల్సి ఉంది. తెలంగాణలో చెల్లాచెదురుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, వైఎస్సార్సీపీ సానుభూతిపరులను ఒకే వేదిక మీదికి తీసుకుని రావడానికే షర్మిలా ప్రయత్నాలు సాగుతున్నాయని, అది రాజకీయ పార్టీ కావచ్చనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
తెలంగాణలో దీనిపై అప్పుడే విమర్శలు వెలువడుతున్నాయి. సెటైర్లు పడుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి, తన అన్న వైఎస్ జగన్ మీద అలగటం వల్లే షర్మిలా రాజకీయ పార్టీ పెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ.. తనను పట్టించుకోవట్లేదని, పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ చెప్పుకోదగ్గ పదవులు, బాధ్యతలను అప్పగించకపోవడం పట్ల షర్మిలా అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. దాని ప్రభావంతోనే ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్.. ఇలాంటి వ్యాఖ్యలే సంధించారు. వైఎస్ షర్మిలా తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతోన్నారనే వార్తలపై ఆయన స్పందించారు. అన్న మీద అలిగితే ఏపీ లో పార్టీ పెట్టాలె చెల్లెమ్మా అంటూ కామెంట్స్ చేశారు. తెలంగాణలో డ్రామాలు ఆడితే.. చివరికి డిపాజిట్లు కూడా మిగలవంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ అకౌంట్లో ఓ పోస్ట్ పెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తమౌతోందనే వాదనలు వినిపిస్తు్నాయి. తెలంగాణలో జగన్నాటకాలు చెల్లవంటూ టీఆర్ఎస్ అభిమానులు చురకలు అంటిస్తున్నారు.