ఆంధ్రాకు క్యూ కడుతున్న టీడిపి అసంత్రుప్తి నేతలు..! సీట్ల కేటాయింపులపై రగిలిపోతున్న తమ్ముళ్లు.
హైదరాబాద్ : పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అనే సూక్తిని ఇప్పుడు టీడిపి నాయకులు తూచా తప్పకుండా పాటిస్తున్నట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్న తెలుగుతమ్ముళ్ల లో చాలా మందికి టికెట్లను నిరాకరించింది టీడిపి అదిష్టానం. పొత్తు ధర్మంలో భాగంగా కొన్ని నియోజక వర్గాలను త్యాగం చేయాలని ముఖ్యనేతలు చెప్పుకొచ్చినప్పటికి ఆశావహులు ససేమిరా అంటున్నారు. సీటు ఆశించి చివరి నిమిషంలో మిస్సయిన నేతలు, నియోజక వర్గం గల్లంతైన నాయకులు తాడో పేడో తేల్చుకునేందుకు చంద్రబాబు నాయుడు వద్దకు క్యూ కడుతున్నారు. చివరినిమిషం వరకూ పోరాడితే ఏదో ఒక ఫలితం ఉంటుందనేది నాయకుల పట్టుదలగా తెలుస్తోంది.
తెలుగు తమ్ముళ్ల చివరి ప్రయత్నాలు..! చంద్రబాబుకు విజ్ఞప్తి..!!
తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలోని పార్టీలు చేస్తున్న హడావిడితో రాజకీయం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. టిఆర్ఎస్ను ఓడించాలని ఉద్దేశంతో ఏర్పడిన మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇప్పుడిప్పుడే కొలిక్కి వచ్చింది. అయితే, ఆయా పార్టీల్లోని అసమ్మతులు వల్ల కూటమిలో చిచ్చు రేగింది. ఇన్ని రోజులు తమకు టిక్కెట్ వస్తుందని ఆశతో ఉన్న కొందరికి వారి అధిష్టానాలు మొండిచేయి చూపడంతో వారంతా గందరగోళం సృష్టిస్తున్నారు.
చివరివరకూ పోరడతాం..! సీటు దక్కించుకుంటాం అంటున్న తమ్ముళ్లు..!!
అయితే ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ.. తెలంగాణలో మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అందుకే ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు వల్ల తెలంగాణలో అధికారాన్ని చేపట్టవచ్చని భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి, ఆశావహులు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో పార్టీలో కలవరం మొదలైంది. టికెట్ ఆశించి బంగపడ్డ నాయకులు తిరుగుబావుటా ఎగరేయడమే కాకుండా చివరిప్రయత్నంగా చంద్రబాబుకు మొరపెట్టుకుంటున్నారు.
కూటమి వల్ల నష్టపోయామంటున్న నాయకులు..! అమరావతిలో తేల్చుకుంటాం..!
ఇప్పటివరకు తెలంగాణలోని ఎన్టీఆర్ భవన్ వరకే పరిమితమైన టీడీపీ నేతల ఆందోళన ఇప్పుడు అమరావతిని చేరాయి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తమ గోడు వినిపించేందుకు టిటిడిపి నేతలు అక్కడకు వెళుతున్నారు. తాజాగా ఎల్బీనగర్ సీటు తమకే కేటాయించాలని కోరుతూ సామరంగారెడ్డి, ఆయన అనుచరులు గురువారం ఉదయం అమరావతిలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. సామ విషయంపై చంద్రబాబుతో సీనియర్ నేత నామానాగేశ్వర్రావు భేటీ అయి చర్చించారు.
కాంగ్రెస్ ఇచ్చింది కొద్ది సీట్లే..! వాటిలో కూడా అన్యాయం జరిగిందంటున్న నేతలు..!!
అధినేతతో చర్చల అనంతరం సామరంగారెడ్డిని బుజ్జగించేందుకు నామా నాగేశ్వరరావు ప్రయత్నించారు. అయితే ఎల్బీనగర్ టీడీపీ కార్యకర్తలు మాత్రం తమకు ఎల్బీనగర్ సీటు కేటాయించాల్సిందే అని ఆందోళన చేపట్టారు. టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎల్బీనగర్ కాకుండా ఇబ్రహింపట్నం సీటు కేటాయిస్తే 15 రోజుల్లో ఎలా పనిచేసుకోగలం అని సామరంగారెడ్డి ఆయన వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఇన్నిరోజులు టికెట్ల కోసం అమరావతి క్యూకట్టిన వారంతా ఇప్పుడు టికెట్ రాకపోవడంతో అక్కడికి వెళ్లి ఆందోళనలు చేయాలని డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది.