మీ జెండాలు,ఎజెండాలు తెలంగాణకు అవసరం లేదు... షర్మిల పార్టీపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్లోనే వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను,కేసీఆర్ కుటుంబాన్ని తిరస్కరించేందుకు సిద్దమయ్యారని... వారంతా కాంగ్రెస్ వైపు మళ్లకుండా ఉండేందుకే షర్మిలను రంగంలోకి దించారని పేర్కొన్నారు. తెలంగాణ సమాజం ఎడ్డిగా ఏమీ లేదని... ఇదంతా కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు జరుగుతున్న పన్నాగమని అన్నారు. తెచ్చుకున్న తెలంగాణను తెలంగాణ బిడ్డలే ఏలాలని.. రాజన్న బిడ్డ రాజ్యం చేయడమేంటని ప్రశ్నించారు. బుధవారం(ఫిబ్రవరి 10)మహబూబ్ నగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా షర్మిలను తెలంగాణ సమాజం ఒక ఆడబిడ్డగా అక్కున చేర్చుకుంటుందని... అంతే తప్ప తెలంగాణ గడ్డపై జెండా పాతుతామంటే కుదరదన్నారు. రాజకీయ స్వార్థంతో కేసీఆర్కు సహకరించాలనే ప్రయత్నం సరికాదన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను అవమానించే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఏదో ఒక జెండా పట్టుకుని వచ్చి కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని జరుగుతున్న పన్నాగాలను కచ్చితంగా తిప్పికొడుతామన్నారు. మీ పార్టీలు,జెండాలు,ఎజెండాలు ఏవీ తెలంగాణకు అవసరం లేదని షర్మిలను ఉద్దేశించి స్పష్టం చేశారు.దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ అని... తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని రేవంత్ అన్నారు. నిరుద్యోగులు,ఉద్యోగులు,అన్ని వర్గాల సమస్యలపై తాము పోరాటం చేస్తున్నామన్నారు.
అటు బీజేపీ నేతలు కూడా షర్మిల పార్టీ వెనుక కేసీఆర్ ఉన్నారని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తన కుమారుడు కేటీఆర్ నుంచి సీఎం కుర్చీని కాపాడుకునేందుకు కేసీఆర్ కొత్త రాజకీయ సమీకరణాలను తెరపైకి తీసుకొస్తున్నారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. షర్మిల రాజకీయ పార్టీ ఇందులో భాగంగానే జరుగుతోందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, కేసీఆర్ హవా తగ్గిందని... దీంతో కేసీఆర్ను కాపాడేందుకు కేవీపీ రామచంద్రరావు రంగంలోకి దిగారని అన్నారు. కేసీఆర్ కనుసన్నుల్లో,కేవీపీ సూచనల మేరకు షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నారని తెలిపారు.
కాగా, తెలంగాణలో తాను పార్టీ పెట్టబోతున్నట్లు వైఎస్ షర్మిల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నేళ్లయింది... రాష్ట్రంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారంటూ పరోక్షంగా ఆమె టీఆర్ఎస్ను టార్గెట్ చేశారు. విద్యార్థులు,నిరుద్యోగులు,రైతులు... ఎవరు సంతోషంగా ఉన్నారు చెప్పండంటూ మీడియానే ఆమె ఎదురు ప్రశ్నించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలని... ఆ దిశగానే తన ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకోసం త్వరలోనే అన్ని జిల్లాల్లో వైఎస్సార్ అభిమానులతో భేటీ కానున్నట్లు చెప్పారు.