ఎంసెట్ లీకేజీ కేసులో చైతన్య జూనియర్ కాలేజీ డీన్, ఏజెంట్ అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ లీకేజీ కేసులో సీఐడీ అధికారులు గురువారం మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 2016లో వెలుగు చూసిన ఈ స్కాం అప్పట్లో తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపింది. ఈ కేసులో ఇప్పటికే అరవై మందికి పైగా అరెస్టు చేశారు. ఇప్పుడు మరో ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు.
ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ చైతన్యపురి చైతన్య కాలేజీ డీన్ వెలేటి వాసుబాబును అరెస్టు చేశారు. ఆయనతో పాటు కమ్మ వెంకటశివనారాయణ అరెస్టయ్యారు. వెంకటనారాయణ.. నారాయణ, చైతన్య కాలేజీలలో విద్యార్థులను చేర్పించే ఏజెంట్గా పని చేస్తున్నాడు.
పేపర్ లీకేజీ స్కాం ప్రధాన నిందితుడితో వాసుబాబు, శివనారాయణలు ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నట్లు గుర్తించారు. 2016 జూలైలో ప్రధాన నిందితుడిని వాసుబాబు కలిశాడని గుర్తించారు. వాసుబాబు ఆరుగురు విద్యార్థులకు ముందస్తుగా పేపర్ అందజేశాడు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.35 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వాసుబాబును హైదరాబాదులో అరెస్టు చేయగా, వెంకటశివనారాయణను గుంటూరులో అరెస్టు చేశారు. వీరిద్దరికి ఈ కేసులో కీలక పాత్ర పోషించిన నిందితులు డాక్టర్ ధనుంజయ, డాక్టర్ సందీప్ కుమార్లతో సంబంధం ఉన్నట్లు తేలింది. కాగా కార్పోరేట్ కళాశాలల ప్రతినిధులు మరికొందరు ఉండవచ్చునని సీఐడీ అనుమానిస్తోంది.
ముందుగా వెల్లడైన ప్రశ్నాపత్రంతో వీరు భువనేశ్వర్లో క్యాంప్ నిర్వహించారు. ఆరుగురు విద్యార్థులను అక్కడకు తీసుకెళ్లి మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. పరీక్షకు ముందు రోజు హైదరాబాద్ తీసుకొచ్చి రాయించారు. ఇందులో ముగ్గురికి ర్యాంకులు వచ్చాయి.