ఏపీ ప్రభుత్వం తెలంగాణలో ప్రకటనలు ఇవ్వొద్దు: తెలంగాణ ఈసీ సీఈవో రజత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 2.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈవో రజత్ కుమార్ మంగళవారం తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్ల తుది జాబితాను అందజేస్తామని చెప్పారు. ఈ నెల 23వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఓటరు స్లిప్పుల పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఓటరు స్పిప్పులు కుటుంబ సభ్యులకే ఇవ్వాలని చెప్పారు.
రాష్ట్రంలో 32,796 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. రేపు (బుధవారం) సెలవు ఉన్నప్పటికీ నామినేషన్ల పరిశీలనను పూర్తి చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ప్రకటనలు ఇవ్వవద్దని రజత్ కుమార్ స్పష్టం చేశారు. అవి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని చెప్పారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై స్పందిస్తున్నామన్నారు. నోటీసులకు ఇచ్చే వివరణల ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు సీవిజిల్ యాప్ ద్వారా 3,500 ఫిర్యాదులు అందాయని చెప్పారు. అందులో 2,220 సరైనవి అన్నారు. ఐదు లక్షల ఓటర్ గుర్తింపు కార్డులు మీ సేవకు అందించామని, నెలాఖరు వరకు కొత్త ఓటర్లందరికీ గుర్తింపు కార్డులు అందిస్తామన్నారు. తనిఖీల్లో భాగంగా రూ.90.72 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఓటింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఓటర్ల జాబితాను ఖరారు చేశామని రజత్ కుమార్ వెల్లడించారు. 7,45,838 మంది కొత్త ఓటర్లు, 243 మంది ప్రవాసులు ఓటర్లుగా నమోదయ్యారని చెప్పారు. తాజాగా ప్రకటించిన జాబితా ఆధారంగానే డిసెంబర్ 7న పోలింగ్ జరుగుతుందన్నారు. ఈ నెల 23 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తామని, బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి స్లిప్పులు పంపిణీ చేయాలన్నారు.
బల్క్గా ఓటరు స్లిప్ప్పులు పంపిణీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. మిగిలిన ఓటరు స్లిప్పులు ఓటింగ్ రోజు పోలింగ్ కేంద్రం వద్ద పెట్టి పంపిణీ చేస్తామన్నారు. ఓటరు స్లిప్పులపై పోలింగ్ కేంద్రం మ్యాప్, వివరాలు కూడా ఉంటాయన్నారు.
నామినేషన్ల గురించి మాట్లాడుతూ... 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 3,583 నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. మొత్తం 32,796 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 9,445 సర్వీస్ ఓటర్లు ఉన్నారన్నారు. పోలింగ్ సిబ్బంది కోసం 1,60,509 మందిని గుర్తించామని, రాష్ట్ర స్థాయిలో 35 వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నారన్నారు.
పోలింగ్ రోజు మొత్తం 48 వేల మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారని, 279 కంపెనీల కేంద్ర బలగాలు కూడా విధుల్లో ఉంటాయన్నారు. అందరు ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనాలన్నారు. మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లాలో పోలింగ్ సిబ్బంది కొరత ఉందన్నారు.