తెలంగాణా విద్యాశాఖ సంచలన నిర్ణయం..థర్మాకోల్తో క్లాస్ రూమ్స్
తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుండి పాఠశాలల నిర్మాణం విషయంలో అధునాతన సాంకేతికతను వాడాలని భావిస్తోంది. ఎక్స్పాండెడ్ పాలి స్టెరీన్(ఈపీఎస్) టెక్నాలజీతో తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. తక్కువ ఖర్చుతో, ఎక్కువ మన్నిక కలిగిన ఈ నిర్మాణాలతో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ను విద్యార్థుల కోసం అందించనుంది.
థర్మాకోల్తో తరగతి గదుల నిర్మాణం..సైఫాబాద్ విద్యాశాఖ డైరెక్టరేట్లో పైలెట్ ప్రాజెక్టు
ఎక్స్పాండెడ్ పాలి స్టెరీన్(ఈపీఎస్) టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు నిలిచేలా విద్యాశాఖ కొత్త ఆలోచనలతో..సరికొత్త క్లాస్ రూమ్స్ రూపుదిద్దుకోనున్నాయి. అయితే ఈ టెక్నాలజీతో థర్మాకోల్ తో తరగతి గదులను నిర్మిస్తారు. తెలంగాణారాష్ట్రంలో ప్రస్తుతం థర్మాకోల్ తో ముందుగా సైఫాబాద్లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ప్రాంగణంలో పైలట్ ప్రాజెక్టుగా ఒక తరగతి గదిని నిర్మిస్తున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా థర్మాకోల్ తో క్లాస్రూమ్ లను నిర్మించనున్నారు.సాధారణ పద్ధతిలో ఒక తరగతి గది నిర్మించాలంటే రూ.7లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ థర్మాకోల్ తో రూ.5 లక్షల ఖర్చుతోనే నిర్మించవచ్చు.
ఈపీఎస్ విధానంతో బోలెడన్ని ఉపయోగాలు
సాధారణ కట్టడాల కంటే ఈపీఎస్ విధానంలో భవనాల నిర్మాణానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అంతేకాదు చాలా ప్రత్యేకతలు కూడా ఈ నిర్మాణాలకు ఉన్నాయి. ఈ విధానంలో నిర్మాణాలకు ప్రత్యేకమైన థర్మాకోల్ను ఉపయోగిస్తారు. ఈ నిర్మాణంలో ఇనుముకు బదులుగా స్టీల్ను వాడతారు. స్టీల్ తీగలను థర్మకోల్కు బిగిస్తారు. దానికి ఇసుక..సిమెంట్ మిశ్రమాన్ని అంటిస్తారు. గోడలతో పాటు పైకప్పును కూడా స్టీల్ తీగలు, థర్మకోల్తోనే ఏర్పాటు చేస్తారు. రూమ్ నిర్మాణం కేవలం 20 రోజుల్లోనే పూర్తి అవుతుంది. ఖర్చు కూడా తగ్గుతుంది. ఇవి ఫైర్ ఫ్రూఫ్ మాత్రమే కాదు కరెంట్ షాక్ ప్రూఫ్గా కూడా ఉంటాయని అధికారులు తెలిపారు.
15వేల తరగతి గదుల నిర్మాణానికి నిర్ణయం.. ఖర్చు తగ్గించేందుకే ఈపీఎస్ టెక్నాలజీ
తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు.. కేజీబీవీలు..మోడల్ స్కూల్స్ లో ప్రస్తుతం ఉన్నవాటికంటే అదనంగా 15వేల క్లాస్ రూమ్స్ ను అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 15 వేల తరగతి గదులను ఈపీఎస్ టెక్నాలజీతో నిర్మిస్తే ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల మేర నిధులు ఆదా అవుతుందని అధికారులు అంచనా .ప్రభుత్వ పాఠశాలల్లో 15 వేలకుపైగా అదనపు తరగతి గదుల అవసరం కాగా..వీటి నిర్మాణానికి భారీగా నిధులు అవసరం .ఈ క్రమంలో ఖర్చు తగ్గించేందుకు నూతన టెక్నాలజీ కోసం ప్రయత్నించామనీ..ఖర్చు తక్కువ..మన్నిక ఎక్కువగా ఉన్నటువంటి ఈపీఎస్ టెక్నాలజీ విధానాన్ని ఎంపిక చేశామని స్కూల్విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. మొత్తం మీద తెలంగాణ విద్యాశాఖ స్మార్ట్ ఆలోచనతో స్మార్టెస్ట్ తరగతి గదుల నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది.