అసెంబ్లీ రద్దుపై పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు, మర్రి శశిధర్ రెడ్డి పిటిషన్పై 31న విచారణ
హైదరాబాద్: ఓటర్ల జాబితా అవకతవకలపై హైకోర్టులో వేసిన పిటిషన్లపై శుక్రవారం విచారణ సాగింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై ఎన్నికల సంఘం (ఈసీ) అఫిడవిట్ దాఖలు చేసింది. బూత్ లెవల్ ఓటర్ల జాబితాను హైకోర్టుకు సమర్పించింది.
దీనిపై హైకోర్టు స్పందిస్తూ అఫిడవిట్లో పేర్కొన్న విధంగా ఓటర్ల జాబితా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అఫిడవిట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే 31వ తేదీన వాదనలు వినిపించవచ్చునని చెప్పారు. ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి వేసిన పిటిషన్పై ఈ విచారణ జరగనుంది.
మరోవైపు, అసెంబ్లీ రద్దుపై దాఖలైన ఇతర పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. ఇది హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద ఊరట. తొమ్మిది నెలల ముందే అసెంబ్లీ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీమంత్రి, కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు, న్యాయవాది శశాంక్ రెడ్డి హైకోర్టులో ఇటీవల వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
అసెంబ్లీ రద్దు రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని, ఎమ్మెల్యేలకు సైతం దీనిపై సమాచారం ఇవ్వలేదని డీకే అరుణ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే అసెంబ్లీ రద్దును సవాల్చేస్తూ నేరుగా దాఖలైన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం ఇప్పుడు శుక్రవారం కొట్టివేసింది.