నర్సంపేటలో హిస్టరీ రిపీట్.. ఇప్పటి వరకు గెలువని..
ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్లోని నర్సంపేట నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకప్పుడు కమ్యునిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రభంజనానికి కూడా తలవగ్గలేదు. అయితే కాలానుగుణ పరిస్థితులకు అనుగుణంగా మారిపోయింది. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గెలువకపోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..
ఉద్యమాలకు కోటగా
నర్సంపేట నియోజకవర్గం కమ్యునిస్టు ఉద్యమాలకు పెట్టింది పేరు. కమ్యునిస్టు పార్టీ నుంచి విడిపోయిన మద్దికాయల ఓంకార్ ఐదుసార్లు ఈ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. పార్టీలో రెబెల్గా మారడంతో ఆయనను సీపీఎం బహిష్కరించింది.
ఓంకార్ ఎంసీపీఐ ప్రభంజనం
సీపీఎం నుంచి బయటకు వచ్చిన ఓంకార్ సొంతంగా మార్కిస్టు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఎంసీపీఐ)ని స్థాపించి వరుస విజయాలు సాధించారు. ఓంకార్ హయాంలో కాంగ్రెస్కు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఓంకార్ మరణం తర్వాత నర్సంపేటలో తెలుగుదేశం పార్టీ పాగా వేసింది.
నర్సంపేటపై టీడీపీ పట్టు
ఓంకార్ రాజకీయాల్లో నుంచి తప్పుకొన్న తర్వాత తెలుగుదేశం పార్టీ బలంగా క్యాడర్ను పెంచుకొన్నది. రేవూరి ప్రకాశ్ రెడ్డి తదితరులు నర్సంపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలుపొందారు. ఈ సమయంలో కూడా కాంగ్రెస్ గెలువలేకోపయింది.
కాంగ్రెస్ రెబల్ గెలుపు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సెంటిమెంట్తో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంతా భావించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో నర్సంపేట నుంచి కత్తి వెంకటస్వామికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. అప్పటి వరకు సీటు కోసం పోటీ పడిన దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ రెబల్గా బరిలోకి దిగాడు. కాంగ్రెస్ అభ్యర్థి కత్తి వెంకటస్వామిపై దొంతి మాధవరెడ్డి ఘనవిజయం సాధించారు. దాంతో హస్తం గుర్తు గెలుపు నమోదు చేసుకోలేకపోయింది.
మళ్లీ కాంగ్రెస్కు తప్పని ఓటమి
తాజా ఎన్నికల్లో దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారు. ఆయన ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థిగా పెద్ది సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. పెద్ది, దొంతి మధ్య పోటా పోటిగా పోరు జరిగింది. చివరకు పెద్ది సుదర్శన్ రెడ్డి చేతిలో దొంతి మాధవరెడ్డి ఓటమి చవిచూశారు. దాంతో హస్తం గుర్తు మరోసారి గెలువలేకపోయింది.