మహిళా సాధికారత ఇదేనా: టికెట్ కేటాయింపుల్లో మహిళలను విస్మరించిన రాజకీయ పార్టీలు
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే టికెట్ కేటాయింపులు, నామినేషన్ల పర్వాలు ముగిశాయి. ఇక టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళుతున్నారు. ప్రతి ఇంటి తలుపును తట్టి తమకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు టికెట్ కేటాయింపులపై చర్చ జరుగుతోంది. ఓ వైపు మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు మొగ్గు చూపుతున్నప్పటికీ తమ పార్టీ విషయానికొచ్చే సరికి టికెట్ కేటాయింపుల్లో మహిళలకు ప్రాధాన్యత తగ్గిపోతోందనే మాట వినిపిస్తోంది.
ఇద్దరు కాదు.. ముగ్గురు: మళ్లీ రేవంత్ సంచలనం వ్యాఖ్యలు, విశ్వేశ్వర్ రెడ్డి ఊహించని ట్విస్ట్
మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు
తెలంగాణలో అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దుతు తెలుపుతున్నాయి. కేవలం ఎన్నికల సమయంలోనే మహిళా సంక్షేమంపై ఆలోచనలు చేస్తూ బండెడు హామీలు ఇస్తున్నాయి. ఆ హామీలు అమలు అవుతున్నాయా లేదా అనే విషయం పక్కనబెడితే... రాజకీయంగా మహిళలకు టికెట్లు ఏమాత్రం కేటాయిస్తున్నాయనేది తెలంగాణలో జోరుగా చర్చ జరుగుతోంది. డిసెంబర్ 7న తెలంగాణలో పోలింగ్ ఉండగా... అందులో ఏయే పార్టీ ఎంతమంది మహిళలకు టికెట్లు కేటాయించిందో అని ఓ సారి లెక్కలు చూస్తే అన్ని పార్టీలు మహిళలకు తక్కువగానే సీట్లు కేటాయించాయి.
11 మంది మహిళలకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్
తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో ముందుగా కాంగ్రెస్ 100 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులకు బీఫామ్లను అందజేసింది. ఇందులో 11శాతం అంటే 11 టికెట్లను మహిళలకు కేటాయించింది . ఇక తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు నటి ఖుష్బూ. మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చిత్తశుద్ధి ఉందని ఖుష్బూ చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ది అని ఆమె గుర్తు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఆ బిల్లును లోక్సభలో పాస్ చేయించడంలో విఫలమైందని ఖుష్బూ విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ 2010లో రాజ్యసభలో పాస్ చేయించింది.
మహిళలకు పెద్ద పీట వేసింది కాంగ్రెస్ పార్టీ: ఖుష్బూ
మహిళలకు కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా 33శాతం టికెట్లు కేటాయించకపోయి ఉండొచ్చు కానీ అత్యధికంగా తెలంగాణలోని పార్టీలలోకెల్లా 11 సీట్లను కాంగ్రెస్ పార్టీ మహిళలకు కేటాయించింది. అదే టీఆర్ఎస్ పార్టీ కేవలం 4 సీట్లు మాత్రమే కేటాయించిందని చెప్పారు. మహిళలకు పెద్ద పీట వేయడం కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని ఖుష్బూ చెప్పారను. ప్రస్తుతం ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మహిళా మాజీ మంత్రులు గీతారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు బరిలో ఉన్నారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న 13 స్థానాల్లో ఒక మహిళకు టికెట్ కేటాయించింది. అది కూడా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మనవరాలు, హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ప్రొఫెసర్ కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితి పార్టీ కూడా ఒక మహిళకు అవకాశం కల్పించింది. సిద్దిపేట నియోజకవర్గం నుంచి భవానీ రెడ్డి తెలంగాణ జనసమితి తరపున బరిలో ఉన్నారు.
టీఆర్ఎస్లో మహిళలకు మళ్లీ అన్యాయమే
మహిళా అభ్యర్థులకు టికెట్ కేటాయింపుల్లో టీఆర్ఎస్ ఎప్పటిలాగే అన్యాయం చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. 2014లో ఆరుగురు మహిళా అభ్యర్థులకు టికెట్లు కేటాయించగా ఈసారి మాత్రం ఆ సంఖ్యను రెండు తగ్గిస్తూ నలుగురికి కేటాయించింది. 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్... సీఎం కేసీఆర్ క్యాబినెట్లో మహిళలకు చోటు ఇవ్వకపోవడం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది.
14 మంది మహిళలకు టికెట్ ఇచ్చిన బీజేపీ
ఇక భారతీయ జనతాపార్టీ అత్యధికంగా 14 మహిళలకు టికెట్ కేటాయింపులు జరుపగా... మజ్లిస్ పార్టీ ఒక్క మహిళకు కూడా టికెట్ కేటాయించలేదు. టికెట్ కేటాయింపుల విషయానికొస్తే బీజేపీ పార్టీ మహిళలకు పెద్ద పీట వేసిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు టికెట్ కేటాయింపుల్లో సామాజిక సమతుల్యత పాటించినట్లు చెప్పారు. బీసీలకు 38 సీట్లు కేటాయించగా... 21 ఎస్సీలకు 12 ఎస్టీలకు టికెట్లు ఇచ్చినట్లు బీజేపీ వెల్లడించింది. ఇక సీపీఎం నేతృత్వంలోని బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ 10 మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది. ఇందులో ఒక ట్రాన్స్జెండర్కు కూడా కేటాయించింది.