అసెంబ్లీ ఫలితాలకు ముందే పావులు: సీట్లు ఎక్కువ.. తక్కువ.. వారి భయం ఏమిటి?
హైదరాబాద్: అసెంబ్లీ ఫలితాలకు ముందే తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుపై ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇటు టీఆర్ఎస్, అటు మహాకూటమి ఎవరికి వారు తమకు మెజార్టీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైకి గంభీరంగా కనిపించినప్పటికీ లోలోన వారికి భయం ఉన్నట్లుగా కనిపిస్తోంది.
అందరి దృష్టి వీరిపైనే: 'లీడర్'ను దెబ్బతీస్తారా, నందమూరి సుహాసిని, బీజేపీ షెహజాదీ ప్రత్యేకం!
ఈ నేపథ్యంలో ఒకవేళ తక్కువ సీట్లు వస్తే అనే ఆలోచనతో మద్దతుపై ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రగతి భవన్లో తెరాస అధినేత కేసీఆర్ను కలిశారు. తమ మద్దతు కేసీఆర్కు ఉంటుందని అసద్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు మజ్లిస్తో జతకట్టకుంటే తాము తెరాసకు అండగా ఉంటామని బీజేపీ చెబుతోంది.
గవర్నర్ వద్దకు కూటమి నేతలు
ఇదిలా ఉండగా మహాకూటమి కూడా ప్రభుత్వం ఏర్పాటుపై ధీమాగా ఉంది. అదే సమయంలో సీట్ల విషయంలో అధికారికంగా ఎలాంటి కన్ఫ్యూజన్ ఏర్పడకుండా ఉండేందుకు సోమవారం వారు గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్ రమణ, షబ్బీర్ అలీ, కోదండరాం తదితరులు రాజ్ భవన్ వచ్చారు. కూటమి భాగస్వామ్య పక్షాలను ఒక పార్టీగా పరిగణించాలని వారు కోరారు.
ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే ఛాన్స్ లేనట్లేనా
మహాకూటమికి అత్యధిక స్థానాలు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం తమకు ఇవ్వాలని, తమను ముందుగా పిలవాలని కూటమి నేతలు గవర్నర్ను కోరారు. ఎగ్జిట్ పోల్ ట్రెండ్స్ చూసినా, ఆయా పార్టీల పరిస్థితి గమనించినా ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశాలు అంతగా లేనట్లుగా కనిపిస్తోంది.
తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు
కొన్ని సీట్లు తక్కువ పడితే ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా తెరాస నేతలు.. మజ్లిస్ నేతలతో మాట్లాడుతున్నారు. మద్దతు కోసం మజ్లిస్ నేతలతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీస్థాయి నేతలు కూడా మాట్లాడారని తెలుస్తోంది. అంతేకాకుండా పలుచోట్ల కొందరు స్వతంత్రులు గెలిచే అవకాశాలు ఉన్నాయి. గెలిచే అవకాశమున్న స్వతంత్ర అభ్యర్థులను కాంగ్రెస్.. తెరాసలు తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
కూటమి భయం ఏమిటి
మంగళవారం ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాల్లో తెరాసకు లేదా మహాకూటమికి పోటాపోటీగా సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా పరిస్థితుల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకుండా.. తెరాసకు సింగిల్గా ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ, మహాకూటమికి వేర్వేరుగా (వేర్వేరు పార్టీలుగా) ఎక్కువ సీట్లు వచ్చిన పరిస్థితుల్లో తమను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని వారు గవర్నర్ను కోరారు. ఉదాహరణకు తెరాసకు 55 సీట్లు వచ్చి, కాంగ్రెస్ పార్టీకి 50, టీడీపీకి కూటమిలోని ఇతర పార్టీలకు ఓ 8 సీట్లు వస్తే కనుకు.. గవర్నర్ తొలుత తెరాసను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానిస్తారు. అయితే తాము ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడ్డామని, కాబట్టి తమనే ముందు పిలవాలని వారు గవర్నర్ను కోరారు. వేర్వేరుగా కూటమిలోని పార్టీలన్నింటికి కలిసి తెరాస కంటే ఎక్కువ సీట్లు వచ్చినా తమను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవరనే ఆందోళనతో వారు కలిసి, ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమి అంటూ అందుకు ఆధారాలను అందించారు. తమది ఒకే కూటమి అంటూ ఎన్నికలకు ముందు కామన్ మినిమమ్ ప్రోగ్రాంను కూడా ఈసీకి సమర్పించారు.