కేసీఆర్! అపవాదు రాకుండా చూసుకోండి, రనౌట్ అయ్యా: మాజీ సీఎస్ సంచలనం
తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర బుధవారం నాడు పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రమేయం లేకుండానే తాను రనౌట్ అయ్యానని, అయినా ఫర్వాలేదన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర బుధవారం నాడు పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రమేయం లేకుండానే తాను రనౌట్ అయ్యానని, అయినా ఫర్వాలేదన్నారు.
సమర్థులు,షెడ్యూల్ కులాలకు చెందిన అధికారులు గుర్తింపుకు నోచుకోలేదన్న అపవాదు రాకుండా ప్రభుత్వం చూసుకోవాలని పరోక్షంగా హెచ్చరించారు. ప్రదీప్ చంద్ర ఇటీవల పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఆయన మాట్లాడారు.
తన ప్రమేయం లేకుండానే రనౌట్ అయ్యానని చెప్పడం గమనార్హం. షెడ్యూల్ కులాల వాళ్లు సమర్థులైనా గుర్తింపుకు నోచుకోలేదన్న అభిప్రాయం వచ్చిందన్నారు.
పదవీ విరమణ తర్వాత అనేక వర్గాల నుంచి తనకు ఫోన్లు వచ్చాయని చెప్పారు. ఆ అపవాదు రాకుండా ప్రభుత్వం చూసుకోవాలని చెప్పారు. 34 ఏళ్ల తన కెరీర్లో ఎలాంటి మచ్చ లేదన్నారు. ఎవరికీ తలవంచకుండా పని చేశానన్నారు. ఆర్థిక శాఖలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చానని చెప్పారు. ఇప్పటికీ వాటినే అమలు చేస్తున్నారన్నారు.
లేదంటే యువ అధికారుల పైన ప్రభావం పడుతుందన్నారు. తనకు ఆర్థిక శాఖ గురించి ఏం తెలియదని సీఎం కేసీఆర్కు ఎవరో చెప్పారన్నారు. ఆపద్భందు పథకాన్ని డ్రాఫ్ట్ చేసింది తానే అన్నారు. టీఎస్ ఐపాస్లో కీలకంగా వ్యవహరించానన్నారు. కాగా, తన పదవీ కాలం పొడిగించకపోవడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.