టాలీవుడ్లో డ్రగ్స్... మాధవీలత ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ రియాక్షన్...
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో డ్రగ్స్ లింకులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ఇటీవల నటి మాధవీలత పలు షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ పార్టీల్లోనూ డ్రగ్స్ వాడుతారని... దీనిపై తెలంగాణ అధికారులు,ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని అన్నారు. ఈ కామెంట్స్పై తాజాగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ స్పందించింది.
టాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ వాడకంపై ఆధారాలుంటే ఇవ్వాలని ఎక్సైజ్ పోలీసులు కోరారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేశామని... మరికొంతమంది తమ నిఘాలో ఉన్నారని తెలిపారు. ఐదేళ్ల క్రితం పార్టీలకు వెళ్తే అప్పుడే ఫిర్యాదు చేయాల్సిందన్నారు. డ్రగ్స్ విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.
ఇటీవల సుశాంత్ కేసు విచారణలోకి నార్కోటిక్స్ అధికారులు కూడా ఎంట్రీ ఇవ్వడంతో... ఆ పరిణామాలపై మాధవీలత మాట్లాడారు. ఇది మంచి పరిణామమే అని... అయితే బాలీవుడ్లోనే కాదు,టాలీవుడ్పై కూడా దృష్టి పెట్టాలని అన్నారు.టాలీవుడ్లో జరిగే పార్టీల్లో కూడా డ్రగ్స్ వాడుతారని.. అది లేకుండా అసలు పార్టీలు జరగవని ఆరోపించారు. తెలంగాణ నార్కోటిక్స్ అధికారులు టాలీవుడ్పై కూడా ఓ కన్నేయాలని విజ్ఞప్తి చేశారు. సినిమావాళ్లు,పబ్స్,స్టూడెంట్స్ ఎక్కువగా మాదక ద్రవ్యాలను వాడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎక్సైజ్ శాఖ స్పందించింది.