ఎగ్జిట్ పోల్ సర్వేలను విశ్లేషిస్తే తెరాసకు ఇబ్బందులు తప్పవా?: ఈ రెండు సర్వేలు ఏం చేప్పాయంటే?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వివిధ మీడియా ఛానళ్లు, సంస్థలు తమ తమ ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించాయి. అన్ని జాతీయ ఛానళ్లు కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని, కానీ మేజిక్ ఫిగర్ అయిన 60 సీట్లకు అటు ఇటుగా ఉంటుందని దాదాపు తేల్చేశాయి. కేవలం లగడపాటి సర్వే మాత్రం మహాకూటమి గెలుస్తుందని చెప్పింది.
అన్ని సర్వేలను విశ్లేషిస్తే..
టైమ్స్ నౌ - సీఎన్ఎక్స్, ఏపీబీ-సీఎస్డీఎస్, రిపబ్లిక్, న్యూస్ ఎక్స్ వంటి సర్వేలను పరిశీలిస్తే టీఆర్ఎస్ పార్టీకి 50 నుంచి 65 సీట్ల మధ్య వస్తున్నాయి. కేవలం ఇండియా టుడే మాత్రమే 80 సీట్ల నుంచి 90కి పైగా తెరాసకు సీట్లు వస్తాయని చెప్పింది. అదే సమయంలో లగడపాటి సర్వే కూటమి వైపు మొగ్గింది. కూటమికి 55 నుంచి 75, తెరాసకు 25 నుంచి 45 సీట్లు వస్తాయని తేల్చారు. అన్ని సర్వేల తీరును పరిశీలిస్తే బీజేపీకి 3 నుంచి 9 సీట్లు వస్తాయని తేలింది. మజ్లిస్ పార్టీకి ఆరు లేదా ఏడు వస్తాయని తేలింది. మొత్తంగా అన్ని సర్వేలను విశ్లేషిస్తే.. టీఆర్ఎస్ కష్టంగా గట్టెక్కుతుందని అర్థమవుతోంది. 60 సీట్లకు అటు ఇటుగా రావడం లేదా ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆరా ఎగ్జిట్ పోల్లో తెరాసదే గెలుపు
ఇదిలా ఉండగా ఆరా ఎగ్జిట్ పోల్ సర్వేలో తెరాసకు 75 నుంచి 85 సీట్లు, మహాకూటమికి 25-35 సర్వేలు, ఇతరులకు 9-11 సీట్లు వస్తాయని తెలిపింది. ఈ సర్వేల కూడా తెరాస స్పష్టమైన మెజార్టీ వస్తుందని తేలింది. ఇదే సంస్థ చేసిన ప్రీపోల్ సర్వేలో కూడా దాదాపు ఇవే ఫలితాలు వస్తాయని పేర్కొనడం గమనార్హం.
పోస్ట్ పోల్ ఎగ్జిట్ సర్వే ప్రకారం.. టీఆర్ఎస్ 53-57, కాంగ్రెస్-టీడీపీ కూటమి 51-55 సీట్లు, మజ్లిస్ పార్టీ 3-7 సీట్లు, బీజేపీ 1-5 సీట్లు గెలుస్తాయి.
మిషన్ చాణక్య సర్వేలో తెరాసకు తిరుగులేని మెజార్టీ
మిషన్ చాణక్య అనే మరో సంస్థ సర్వేలో తెరాసకు తిరుగులేదని తేలింది. టీఆర్ఎస్ పార్టీకి 78 నుంచి 86, మహాకూటమికి 18 నుంచి 22, బీజేపీకి 2 నుంచి 6, మజ్లిస్ పార్టీకి 6 నుంచి 8, ఇతరులకు ఆరు సీట్లు వస్తాయని ఈ ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది.
ఓట్ షేర్ ఇలా
మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం తెరాసకు 41 నుంచి 45 శాతం ఓట్ షేర్, కాంగ్రెస్ పార్టీకి 31 నుంచి 35 ఓట్ షేర్, బీజేపీకి 11 నుంచి 13 శాతం ఓట్ షేర్, మజ్లిస్ పార్టీకి ఆరు శాతం ఓట్ షేర్, ఇతరులకు ఆరు శాతం ఓట్ షేర్ వస్తుందని తేలింది.