నాగార్జున 'అన్నపూర్ణ స్టూడియోపై' కెసిఆర్ ప్రభుత్వం కన్ను
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నపూర్ణ స్టూడియోకు చెందిన అర ఎకరం భూమిని రోడ్డు వెడల్పు కోసం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంజారాహిల్స్లో అన్నపూర్ణ స్టూడియో ఉన్న విషయం తెలిసిందే. ఇది టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందినది.
అన్నపూర్ణ స్టూడియోకు చెందిన అర ఎకరాన్ని రోడ్డు వెడల్పు కోసం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చూస్తోందని తెలుస్తోంది. ఈ భూమిని ఇచ్చేందుకు యాజమాన్యం తొలుత నిరాకరించినప్పటికీ, ఆ తర్వాత అంగీకరించిందని తెలుస్తోంది.
అన్నపూర్ణ స్టూడియో నుంచి అర ఎకరం రోడ్డు వెడల్పు కోసం తీసుకుంటున్నందుకు ప్రభుత్వం పరిహారం ఇవ్వనుంది. అయితే, పరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం డైలమాలో ఉందని తెలుస్తోంది. పరిహారంగా డబ్బులు ఇవ్వడానికి బదులు అభివృద్ధి హక్కు ఇచ్చే విషయమై ఆలోచిస్తోందని తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2 నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 5 వరకు, అలాగే కృష్ణానగర్ జంక్షన్ నుంచి రోడ్డు వెడల్పు చేసే ఆలోచనలో ఉంది. ఈ మధ్యలో అన్నపూర్ణ స్టూడియో ఉంది. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో రోడ్డు వెడల్పు చేయాలని భావిస్తోంది.
బిజెపి నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్సీ రామచంద్ర రావు.. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. భూమి ఇచ్చేందుకు ఒప్పించారు. అన్నపూర్ణ భూమి ఇవ్వడం ద్వారా దగ్గరలోని పేదల ఇళ్లను కూల్చివేయకుండా ఆపినట్లవుతుందని చెప్పారని తెలుస్తోంది.
1975లో నామమాత్రపు ధరకు దానిని ప్రభుత్వం ఇచ్చినందున పరిహారం ఇవ్వవలసిన అవసరం లేదని కొందరు చెబుతున్నారని తెలుస్తోంది. అయితే, హైదరాబాదులో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం దానిని ఇచ్చారని, దాని కోసమే ఉపయోగించామని యాజమాన్యం చెబుతోంది.
అన్నపూర్ణ స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్ సుప్రియ మాట్లాడుతూ... రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వానికి తాము భూమి ఇచ్చేందుకు వ్యతిరేకం కాదని, అయితే తమ నిర్మాణాలు ఉన్నాయని, వాటి విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.