సాకారమైర స్వప్నం, సుదీర్ఘ నిరీక్షణకు తెర, నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం..
తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు. ప్రజల స్వప్నం సాకారమైన దినం. 58 ఏళ్ల పాటు వివక్షకు గురై.. సొంత రాష్ట్రం సాధించుకొని.. నీళ్లు, నిధులు, నియమాకాల ట్యాగ్లైన్తో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2వ తేదీన ఆవిర్భవించింది. గత ఆరేళ్లుగా ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తూ.. దేశానికే తలమానికంగా నిలిచింది. అభివృద్ధి పథంలో ముందుకెళుతోంది. ఉద్యమ నేత కేసీఆర్.. సీఎంగా రెండోసారి పదవీ చేపట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమయ్యారు. ఇంతకీ తెలంగాణ రాష్ట్ర నినాదం ఎలా వచ్చింది..? ఉద్యమం ఎలా ప్రారంభమైంది. ఉద్యమం నుంచి రాష్ట్రం ఆవిర్భవించే వరకు గల ముఖ్యఘట్టాలను గుర్తుచేసుకుందాం.
Recommended Video
ఈసారి నిరాడంబరంగానే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు
58 ఏళ్ల పాటు అణచివేత...
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రరాష్ట్రం వెరుపడిన సమయంలో.. తెలంగాణ కలిసేందుకు ఒప్పుకోలేదు. కానీ 58 ఏళ్ల పాటు అణచివేతకు గురైంది. 1969లో తొలిదశ ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. ఓయూలో విద్యార్థుల పోరాటం, మృతితో పీక్ చేరింది. తర్వాత మరుగునపడిపోయింది. కానీ తెలంగాణ మేధావులు, విద్యావేత్తలు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా తమ గళం వినిపిస్తూనే ఉన్నారు. కాలుకి బలపం కట్టుకొని జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి గొంతెత్తి నినాదించారు. ఈ సమయంలోనే 2001 ఏప్రిల్ 21వ తేదీన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవీకి రాజీనామా చేసి.. మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. మే 17వ తేదీన కరీంనగర్లో సింహగర్జన సభ నిర్వహించి... రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధ్యమని.. తెలంగాణ కోసం ఎలుగెత్తి గొంతెత్తి నినాదించారు.
2001 ఎన్నికల్లో జయభేరీ
అప్పటినుంచి ఎన్నిక, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీచేస్తూ వస్తోంది. 2001 సెప్టెంబర్లో సిద్దిపేట అసెంబ్లీ నుంచి కేసీఆర్ విజయం సాధించారు. పార్టీ ఆవిర్భవించిన అనతికాలంలోనే ప్రజలు కేసీఆర్కు విజయం కట్టిపెట్టారు. తర్వాత 2004లో టీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీ పెత్తు పెట్టుకుంది. దీంతో తెలంగాణ జాతీయ ఎజెండాగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కామన్ మినిమమ్ ప్రోగ్రామ్లో తెలంగాణ అంశం చేరింది. అప్పటి రాష్ట్రపతి కూడా తెలంగాణ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారు. ఇక అప్పటినుంచి తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంది. 2004 నుంచి ఉద్యమం కొనసాగుతోన్న.. 2009కి మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది.
కేసీఆర్ దీక్ష
ప్రత్యేక రాష్ట్రం కోసం 2009 నవంబర్ 29వ తేదీన కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించారు. కరీంనగర్లోని తన ఇంటి నుంచి సిద్దిపేట వస్తుండగా.. పోలీసులు అలుగునూరు వద్ద అరెస్ట్ చేశారు. అక్కడినుంచి ఖమ్మం.. అటునుంచి నిమ్స్ తరలించారు. కేసీఆర్ దీక్షకు యావత్ తెలంగాణ సమాజం మద్దతు పలికింది. నవంబర్ 29 వ తేదీ నుంచి ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. కేసీఆర్ నిమ్స్లో దీక్ష కొనసాగించడంతో... డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. దీంతో కేసీఆర్ దీక్ష విరమించారు. కానీ తర్వాత ఏపీలో ఆందోళన ప్రారంభం కావడంతో.. డిసెంబర్ 23వ తేదీన విసృత సంప్రదింపులు జరపాలని చిదంబరం మరో ప్రకటన చేశారు.
శ్రీకృష్ణ కమిటీ
డిసెంబర్ 24వ తేదీన జేఏసీ ఏర్పాటు చేసి.. తెలంగాణ రాష్ట్రం కోసం రాజకీయ పార్టీలు ఏకమై పోరాడాయి. ఏపీలో ఆందోళనలు ప్రారంభం కావడంతో... 2010 ఫిబ్రవరి 2వ తేదీన శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు. 2010 డిసెంబర్ 30వ తేదీన కమిటీ హోంశాఖకు నివేదిక సమర్పించింది. ఇక అప్పటినుంచి జేఏసీ తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంది. మిలియన్ మార్చ్, సాగరహారం పేరుతో ఉద్యమాలు చేసింది. కాంగ్రెస్ కోర్ కమిటీ, కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి (సీడబ్ల్యూసీ).. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్, కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రక్రియ ప్రారంభించింది. తెలంగాణ బిల్లుకు మంత్రి వర్గం అక్టోబర్ 8, 2013లో ఆమోదం తెలిపింది.
పార్లమెంట్ ముందుకు..
జీవోఎం ఏర్పాటు, అభిప్రాయ సేకరణ చేసి.. చివరికి ఫిబ్రవరి 13, 2014 లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టగా.. ఆమోదం తెలిపింది. కానీ ఏపీ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకత రావడంతో.. తలుపులు వేసి మరీ బిల్లు పాస్ చేయించారు. తర్వాత ఫిబ్రవరి 18, 2014లో లోక్సభ ఆమోదం తెలిపిన బిల్లును రాజ్యసభ ఆమోదం ముద్ర వేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం మార్చి 1వ తేదీన ఆమోదం తెలిపారు. మార్చ్ 4వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ప్రభుత్వ రాజముద్ర ప్రచురించింది. జూన్ 2వ తేదీ 2014న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజల సుదీర్ఘ స్వప్నం సాకారామైంది.