గాంధీభవన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు: టీఆర్ఎస్ సర్కారుపై ఉత్తమ్ ఫైర్
హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత విశిష్ట ఉద్యమం తెలంగాణలో జరిగిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం గాంధీభవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సోనియా గాంధీ దృఢ సంకల్పంతో ప్రజల సెంటిమెంట్ను గౌరవించి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నాలుగేళ్ల తెలంగాణ రాష్ట్రంలో బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేశామని అన్నారు.
రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, మీరా కుమార్లకు ఉత్తమ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆనాటి అఖిలపక్ష సమావేశంలో పాల్గొనటం మరచిపోలేనిదని.. ఒకే ఒక్క ఎంపీ కలిగిన టీఆర్ఎస్తో రాష్ట్ర ఏర్పాటు జరిగి ఉండేదా? అని ఉత్తమ్ ప్రశ్నించారు. ఇక, గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కేసీఆర్ నెరవేర్చలేదన్నారు.
రైతు రుణమాఫీ మొదలు, దళితులకు మూడెకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, దళిత ముఖ్యమంత్రి, గిరిజనులు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, ఇంటికో ఉద్యోగం ఇలా హామీలన్నీ అలాగే మిగిలిపోయాయని ధ్వజమెత్తారు. వచ్చే జూన్ 2 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, రైతులను రుణ విముక్తుల్ని చేస్తామని ఉత్తమ్ తెలిపారు.