తెలంగాణా అవతరణ వేడుకలు .. చిరంజీవి, జనసేనాని పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు ..ఏమన్నారంటే
తెలంగాణ రాష్ట్ర ప్రజలు పండుగ జరుపుకునే రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం అవతరించిన నేటి రోజు. చిన్నపిల్లల దగ్గర నుండి పండు ముదుసలి వరకు జై తెలంగాణ అని నినదించి సాధించుకున్న తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించి అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తోంది.ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు ఉద్యమ పార్టీగా పోరాటం సాగించిన టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ గా పాలన సాగిస్తోంది.
తెలంగాణా అవతరణ వేడుకలు : అమరులకు కేసీఆర్ నివాళి ..శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి
సోషల్ మీడియా వేదికగా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మెగా బ్రదర్స్
నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భారతదేశమంతా కరోనా వైరస్ మహమ్మారి చేతిలో చిక్కి విలవిల లాడుతున్న సమయంలో తెలంగాణ ప్రజానీకం నిరాడంబర తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇక ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరులను స్మరించుకుంటున్నారు పలువురు ప్రముఖులు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మెగా బ్రదర్స్ చిరంజీవి, జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణా రాష్ట్ర ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజు : చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ లో ‘‘ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా, దశాబ్దాల కల సాకారం చేసి జన హృదయ నేత సీఎం కేసీఆర్ గారికి, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు'' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల దశాబ్దాల కల సాకారమైంది అని, జన హృదయ నేత కేసీఆర్ అని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణా జన్మించిన రోజు .. కోట్లాది మంది త్యాగఫలం : పవన్ కళ్యాణ్
మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం సాకారమైన ఈ రోజు చారిత్రాత్మకమైనదని ఆయన పేర్కొన్నారు. కోట్లాది మంది కల సాకారమైన రోజు,దశాబ్దాల కోరిక నెరవేరిన రోజు అంటూ చాలా ఉద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ ఇక .ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణజన్మించిన రోజు అయిన ఈ రోజు వేలాది మంది బలిదానాలు.. కోట్లాది మంది త్యాగాల ఫలం మన తెలంగాణ అని గుర్తుంచుకోవాలని పవన్ కళ్యాణ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
అమరుల త్యాగాలను స్మరించుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్
అభివృద్ది ఫలాలు అందరికి అందించవల్సిన బాధ్యత ప్రభుత్వాలను నడిపే నేతలు,ప్రజా ప్రతినిధులు, రాజకీయ పక్షాలపై ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం దినదిన ప్రవర్థమానం అవ్వాలని,అభివృద్ధిలో తిరుగులేని శక్తిగా నిలవాలనికోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక అంతే కాదు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు అంజలి ఘటిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరుల త్యాగాలను స్మరించుకున్నారు .