తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం..! శుభాకాంక్షలు తెలిపిన గబ్బర్ సింగ్..!!
హైదరాబాద్ : రేపు తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా పవన్ సంతకంతో కూడిన ప్రకటనను జనసేన పార్టీ రోజు విడుదల చేసింది. జూన్ 2.. తెలంగాణ ప్రజల కల సాకారమైన రోజు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. అనేక మంది యోధుల త్యాగఫలంతో తెలంగాణ ఆవిర్భవించిందని వ్యాఖ్యానించారు.
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ బిడ్డలకు తన తరఫున, జనసేన పార్టీ తరఫున పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసిన అమరులకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నట్లు పవన్ చెప్పారు.అభివృద్ధి ఫలాలు అందరికీ అందినప్పుడే ఈ అమరులకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మహనీయుల మాటలు నిజం కావాలని కోరుకుంటున్నట్లు జనసేనాని పేర్కొన్నారు.
రేపు జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ లోని నాంపల్లి పబ్లిక్గార్డెన్స్లో రాష్ట్ర అవతరణ ఏర్పాట్లను మంత్రి తలసాని నేడు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జెండా ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిపై ప్రసంగిస్తారన్నారు.
రాష్ట్రంలో 70 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ ఐదేళ్లలో జరిగిందని తెలిపారు. వేడుకలకు భద్రత కట్టుదిట్టం చేసినట్లు సీపీ అంజనీకుమార్ చెప్పారు. ఇప్పటికే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు.