తెలంగాణా అవతరణ వేడుకలు : అమరులకు కేసీఆర్ నివాళి ..శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి
నేడు తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన రోజు. తెలంగాణ ప్రజల కన్నకలలు నిజమై కళ్ళ ముందు నిలిచిన రోజు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం , తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవం కోసం జరిపిన పోరాటంలో తెలంగాణ ప్రజలు సక్సెస్ అయిన రోజు. సబ్బండ వర్ణాలు ముక్తకంఠంతో జై తెలంగాణ అని నినదించిన రోజు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన ఈ రోజు. అయితే ప్రతి సంవత్సరం అట్టహాసంగా నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈసారి చాలా నిరాడంబరంగా జరపాలని నిర్ణయించారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రం ఆర్థికంగా కుదేలైన వేళ తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు సాదాసీదాగా జరగనున్నాయి.
Recommended Video
టీఆర్ఎస్ నేతల్లో కరోనా నింపిన నైరాశ్యం .. నామినేటెడ్ పోస్టులు ఉన్నట్టా ? లేనట్టా ?
తెలంగాణా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించిన రాష్ట్రపతి
ఇక తెలంగాణ రాష్ట్రం సాకారమైన నేటి రోజును ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు కష్టపడి పని చేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు దేశం యావత్తూ గర్వించదగిన సంస్కృతి సంప్రదాయాలు సాహిత్యం తెలుగు వారి సొంతమని రామ్ నాథ్ కోవింద్ వెల్లడించారు. ఇక తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్తు దిశగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్ర సోదర, సోదరీమణులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రామ్ నాథ్ కోవింద్ తెలుగు లో ట్వీట్ చేశారు.
గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ అమరవీరులకు నివాళులు అర్పించారు ప్రగతి భవన్ నుంచి గన్ పార్క్ చేరుకుని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఇక సీఎం కేసీఆర్ వెంట హోం మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేష్ కుమార్ తదితరులు అమరులకు నివాళి అర్పించారు. తెలంగాణ భవన్ లో కూడా నిరాడంబరంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అక్కడ కేశవరావు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.
మండలిలో గుత్తా , అసెంబ్లీలో పోచారం జాతీయ జెండా ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఆరో వార్షికోత్సం సందర్భంగా అటు అసెంబ్లీలోనూ, ఇటు శాసన మండలిలోనూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు .శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అసెంబ్లీలో జాతీయ జెండాను ఎగురవేశారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక అన్ని జిల్లాల్లోనూ నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా, ఎలాంటి హడావుడి లేకుండా జరుపుకుంటున్నారు.