తెలంగాణా అవతరణ విషెస్: తెలుగు రాష్ట్రాలకు మోడీ ట్వీట్స్..వెంకయ్య నాయుడు, తెలంగాణా మంత్రులు ఇలా
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి .రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోడీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలలో తన ప్రతిభను చాటుతున్నారు అని పేర్కొన్నారు. అంతేకాదు దేశ ప్రగతిలో తెలంగాణ రాష్ట్ర ఓ ముఖ్య భూమిక పోషిస్తుందని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం, వారి శ్రేయస్సు కోసం నేను ప్రార్ధిస్తున్నాను అంటూ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ.
తెలంగాణా అవతరణ వేడుకలు .. చిరంజీవి, జనసేనాని పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు ..ఏమన్నారంటే
రెండు రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలుగా ఏర్పడిన రోజు : మోడీ శుభాకాంక్షలు
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సైతం శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ కృషి మరియు పట్టుదల ఈ సంస్కృతికి మారుపేరని ఆయన పేర్కొన్నారు. దేశ పురోభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూమిక ఎంతో గణనీయమైనదని ఆయన ప్రస్తావించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆశిస్తున్నాను అంటూ మరో ట్వీట్ చేసిన నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సైతం శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి కొత్త రాష్ట్రాలు గా అవతరించిన రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ చరిత్ర ఘనమైనదన్న వెంకయ్య నాయుడు
ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు, ఇంగ్లీష్ , హిందీ మూడు భాషల్లో ట్వీట్ చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలంగాణ చరిత్ర ఘనమైన చరిత్ర అని కొనియాడారు. సహజ వనరులతో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తున్న తెలంగాణ గురించి ఆయన తన ట్వీట్ లో ప్రస్తుతించారు. వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతి తో, దేశ అభివృద్ధిలో తన వంతు పాత్రను పోషిస్తున్న తెలంగాణ రాష్ట్రం మరింత సమృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరుల త్యాగాలను స్మరించుకుంటున్న తెలంగాణా మంత్రులు హరీష్, ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రంలోనూ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ మంత్రులు, ఎంపీలు ,ఎమ్మెల్యేలు నాటి ఉద్యమకాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. అమరుల త్యాగాలకు, ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ పురోభివృద్ధి సాధిస్తుందని మంత్రి తన్నీరు హరీష్ రావు వ్యాఖ్యానించారు .ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షతో కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని హరీష్ రావు పేర్కొన్నారు. భారత దేశానికి తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందని ఆయన కొనియాడారు. ఇక మరో పక్క మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్యమస్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని కెసిఆర్ పోరాటపటిమ, అమరుల బలిదానాల వల్లనే తెలంగాణ రాష్ట్రం సాకారం అయిందని పేర్కొన్నారు.
ఉద్వేగానికి లోనైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ , శుభాకాంక్షలు చెప్పిన మాజీ ఎంపీ కవిత
ఇక మాజీ ఎంపీ కవిత కెసిఆర్ గారి బాటలో రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ప్రతి తెలంగాణ బిడ్డకు వందనం అంటూ పేర్కొన్నారు. ఉద్యమ ప్రస్థానం లో అమరులైన వీరులకు జోహార్లు అంటూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కవిత. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో జెండా ఆవిష్కరించి ఉద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా రాలేదని , వందల మంది ఆత్మార్పణతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని అమరులను గుర్తుచేసుకొని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర సాధనలో నాటి ఉద్యమ నేత కెసిఆర్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన సందర్భాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.